వేట మొదలైంది

ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వేట మొదలైంది. గురువారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవ బాంబు పేలుడులో 170 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇంతే సంఖ్యలో జనాలు, సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడికి ఐఎస్ఐఎస్(ఐసిస్) తీవ్రవాదులే కారణమని అమెరికా అనుమానించింది. దీనికి తగ్గట్లే తామే పేలుడు జరిపినట్లు ఐసిస్-కే ప్రకటించుకుంది. దీంతో వెంటనే ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దృష్టిపెట్టింది.

ఐసిస్ నేతలు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా హెచ్చరించారు. హెచ్చరికలు చేసినట్లే 24 గంటల్లోనే దాడులు మొదలు పెట్టేశారు. ఆఫ్ఘనిస్ధాన్లోని ఐసిస్ స్ధావరాలు ఎక్కడెక్కడున్నాయో వాటన్నింటిపైనా అమెరికా డ్రోన్లు, విమానాలతో శనివారం ఉదయం నుండి దాడులు మొదలు పెట్టింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది తీవ్రవాదులు హతమయ్యారనే విషయం కానీ లేకపోతే ఎన్ని స్థావరాలను ధ్వంసం చేశామని కానీ అమెరికా ప్రకటించలేదు.

జరిగిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తాలిబన్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పైకి ఐసిస్-తాలిబన్ల మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్నా లోలోపల అంతా ఒకటే అని అమెరికా అనుమానిస్తున్నారు. ఐసిస్-కే పేరుతో ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్లోని కునార్, నాన్ గుర్హర్, నూరిస్ధాన్ ప్రావిన్సుల్లో ఐసిస్-కే తీవ్రవాద సంస్ధ చాలా బలంగా ఉంది. దీనికున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తాలిబన్లకు ఉపయోగిస్తున్నట్లు అమెరికా అనుమానిస్తున్నది.

దాడులకు ముందు జాగ్రత్తగా కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర నుండి మామూలు జనాలను వెళ్ళిపోవాలంటు అమెరికా ప్రకటించింది. తాము ఐసిస్ మూకలపై దాడులు మొదలుపెట్టగానే తమపై కోపంతో తీవ్రవాదులు మళ్ళీ మామూలు జనాలపై దాడులు జరపవచ్చని అమెరికా అనుమానిస్తోంది. అందుకనే అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని పదే పదే చెబుతోంది. అయితే జనాల్లో చాలామంది పట్టించుకోవటంలేదు.

ఎందుకంటే ఏ విమానం కాబూల్ విమానాశ్రయం నుండి బయలు దేరుతున్నా దాంట్లో ఎక్కి ఏదో దేశానికి వెళ్ళిపోవాలనే ఆతృతలో జనాలున్నారు. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేకపోతున్నారు జనాలు. ముందు ఆఫ్ఘనిస్ధాన్ నుండి బయటపడితే చాలన్నట్లు గా ఉంది వాళ్ళ పరిస్థితి. అందుకనే ఏ విమానం బయలు దేరుతున్నా అందులోకి ఎక్కటానికి జనాలు ఎగబడుతున్నారు. పాస్ పోర్టు, వీసాలు లేకపోయినా పర్వాలేదని చాలాదేశాలు అనుకున్న కారణంగా జనాలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు.