బాణం గురి తప్పిందా ?

తెలంగాణా రాజకీయాల్లో జగనన్న బాణం గురి తప్పిందనే చర్చలు పెరిగిపోతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా చెప్పుకుని వైఎస్సార్టీపీ ని పెట్టిన వైఎస్ షర్మిల పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. పార్టీ పెట్టకముందు షర్మిల గురించి అంత ఇంత అని ప్రచారం జరిగింది కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏమైందో తెలీదు కానీ అంత జావకారిపోయారు. పార్టీలో పేరున్న నేతలెవరూ చేరలేదు.

ఎవరు చేరకపోగా అప్పటికే ఉన్న ప్రతాప్ రెడ్డి, ఇందిరా శోభన్ లాంటి నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇక పార్టీలోని నేతల మధ్య సమన్వయం లేదని, పార్టీ ప్రకటించిన పార్లమెంటు ఇన్చార్జి నేతలు కూడా పదవుల్లో కంటిన్యూ అవటానికి ఇష్టపడటం లేదనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. వైఎస్సార్టీపీలో షర్మిల తప్ప అందరికీ తెలిసిన రెండో మొహం కనబడకపోవటమే పెద్ద లోపంగా తయారైంది.

నిజానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, అభిమానులున్నారన్నది వాస్తవం. లేకపోతే పార్టీ తరపున ఎవరూ ప్రచారం చేయకపోయినా 2014లో ఖమ్మం ఎంపి స్థానంతో పాటు ఇదే జిల్లాలో మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు గెలవటమంటే మామూలు విషయం కాదు. అంతటి అభిమానులను నమ్ముకునే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు.

అయితే పార్టీ పెట్టిన తర్వాత సీన్ పూర్తిగా రివర్సులో నడుస్తోందనేది టాక్. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం షర్మిల చేస్తున్న నిరాహార దీక్షలు కూడా ఏదో ఉనికిని చాటుకోవటానికి పనికొస్తున్నాయని జనాలు అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంక్రీట్ గా షర్మిల పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఒక్కటి కూడా లేదన్నది వాస్తవం. ఒకవైపు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి జనాల్లోకి ఎలా దూసుకుపోతున్నారో అందరు చూస్తున్నదే.

ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రలని ఇంకోటని ప్రకటనలు చేస్తూ బాగా హడావిడి చేస్తున్నారు. ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే షర్మిల బాగా వెనకబడ్డారనే చెప్పాలి. మరి ఈ ఏడాది చివరిలో పాదయాత్ర మొదలు పెట్టడానికి షర్మిల ప్లాన్ చేస్తున్నారు. దాంతో అయినా షర్మిల పార్టీ జనాలను, నేతలను ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఇప్పటికైతే జనాలను ఆకర్షించటంలో ఈ బాణం గురి తప్పిందనే అనుకోవాలి.