ఆ కామెంట్లు మ‌న గురించేనంటావా.. వైసీపీలో గుస‌గుస‌..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇటీవ‌ల కాలంలో ఉలికిపాటు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దేశం ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఇక్క‌డ వైసీపీకి అంట‌గ‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో.. వైసీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం ఫోన్లు చేసుకుని .. ‘ఆ కామెంట్లు మ‌న‌గురించేనంటావా?` అని గుస‌గుస‌లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఓ వారం కింద‌ట‌.. తెలంగాణ హైకోర్టు.. అక్క‌డి కేసీఆర్ స‌ర్కారును ఒక విష‌యంలో నిల‌దీసింది. అక్క‌డ అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి.. స‌రైన నిబంధ‌న‌లు రూపొందించ‌లేద‌ని.. దీనివ‌ల్ల‌.. ల‌బ్ధిదారుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని.. పేర్కొంటూ. దాఖ‌లైన పిటిష‌న్‌పై.. విచార‌ణ చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలో.. తెలంగాణ హైకోర్టు.. జీవోల‌ను దాచ‌డానికి వీల్లేద‌ని.. ర‌హ‌స్య జీవోలు ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మూ లేద‌ని.. స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. 24 గంట‌ల్లోనే.. జీవోల‌ను ఆన్‌లైన్‌లో పెట్టాల‌ని కూడా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే.. ఈ విష‌యం ఏపీలో కాక‌రేపింది. ఇదే ప‌రిస్థితి మ‌న ద‌గ్గ‌రా ఉందిక‌దా.. మ‌న గురించి కూడా వ్యాఖ్యలు అనుసంధానం అవుతాయా ? అంటూ.. వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకున్నారు. ఇక‌, వైసీపీ వ్య‌తిరేక మీడియాలో ఈ కామెంట్లు జోరుగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మొత్తంగా.. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది.

ఇది జ‌రిగిన కొన్నాళ్ల‌కు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఓ కార్య‌క్ర‌మంలో మాట్లా డుతూ.. “స‌మాజంలో ఉన్న‌త‌స్థానంలో ఉన్న వారికి.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కూడా పోలీసుల వేధింపులు త‌ప్పడం లేదు. వారిపైనా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఠాణాల్లో మాన‌వ హ‌క్కుల‌కు అడుగ‌డుగునా భంగం వాటిల్లుతోంది!” అని పేర్కొన్నారు. వాస్త‌వానికి సీజే ఎవ‌రిని ఉద్దేశించి అన్నారో తెలియ‌దు. కానీ, వైసీపీలో మాత్రం క‌ల‌క‌లం రేగింది. కొన్నాళ్ల కింద‌ట‌.. ఎంపీ ర‌ఘురామ‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం.. ఆయ‌నేమో.. త‌న‌ను కొట్టార‌ని ఆరోపించ‌డం తెలిసిందే. దీంతో ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలోనే అలాంటి వ్యాఖ్య‌లు వ‌చ్చాయా ? అని వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుకున్నారు.

ఇక‌, తాజాగా.. ఛ‌త్తీస్‌గ‌డ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌.. పోలీస్ అధికారిపై అక్క‌డి ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది. ఆయ‌న‌పై ఏకంగా దేశ‌ద్రోహం కేసును న‌మోదు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే పోలీసులు.. త‌ర్వాత కాలంలో ప్ర‌భుత్వాల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నార‌ని పేర్కొంది. అంతే! ఈ వ్యాఖ్య‌ల ప‌ర్య‌వసానం కూడా వైసీపీలో క‌నిపించింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉదంతాన్ని నాయ‌కులు గుర్తు చేసుకుని.. “ఆ కామెంట్లు మ‌న గురించేనంటావా? ” అంటూ.. పెద‌వులు విరుచుకున్నారు. ఇదీ సంగ‌తి!! మున్ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో!!