క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా మార్చేందుకు అడుగులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. కేవ‌లం అమ‌రావ‌తిని మాత్ర‌మే రాజ‌ధానిగా ఉంచ‌కుండా.. పాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ అధికారంలోకి రాగానే మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్ర‌తిప‌క్షాల నుంచి ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ అవి ప‌ట్టించుకోకుండా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

ఇక తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (హెచ్ఆర్సీ) ప్ర‌ధాన‌ కార్యాలయాన్ని క‌ర్నూలుకు మార్చాల‌నే ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై జోక్యం చేసుకోలేమ‌ని ఆ కార్యాల‌యాన్ని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది రాష్ట్ర విశేషాధికారమ‌ని హైకోర్టు చెప్ప‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో జోష్ వ‌చ్చింది. దీంతో స్వ‌తంత్ర ప్రతిప‌త్తి క‌లిగిన అన్ని న్యాయ కార్యాల‌యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా క‌ర్నూలుకు త‌ర‌లించే దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావ‌తితో పాటు విశాఖ‌, క‌ర్నూలును రాజ‌ధానులుగా చేయాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా మారుస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ దిశ‌గానే హైద‌రాబాద్‌లో ఉన్న ఏపీ హెచ్ఆర్సీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని క‌ర్నూలుకు త‌ర‌లించేందుకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అయితే క‌ర్నూలుకు ఈ కార్యాల‌యాన్ని త‌ర‌లించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది.

క‌ర్నూలులో ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏకే గోస్వామి, జ‌స్టిస్ ఎన్‌.జ‌య‌సూర్య‌తో కూడిన ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్ల‌డించింది. తెలంగాణ‌లో కాకుండా రాష్ట్ర ప‌రిధిలో హెచ్ఆర్సీని ఏర్పాటు చేయాల‌ని గ‌తంలో స్ప‌ష్టం చేశామ‌ని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది రాష్ట్ర విశేషాధికార‌మ‌ని ఫ‌లానా చోట ఏర్పాటు చేయ‌లేమ‌ని ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది.

హెచ్ఆర్సీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని క‌ర్నూలుకు మారుస్తూ ప్ర‌భుత్వం రాజ‌ప‌త్రం కూడా విడుద‌ల చేసింది. ఈ కార్యాల‌యాన్ని మార్చేందుకు కొంత‌కాలం ప‌డుతుంద‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఎస్‌.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై విచార‌ణ‌ను కోర్టు నాలుగు వారాల‌కు వాయిదా వేసింది. మ‌రోవైపు వివిధ న్యాయ కార్యాల‌యాల‌నూ క‌ర్నలుకు త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇత‌ర క‌మిష‌న్ కార్యాల‌యాలు, ట్రిబ్యున‌ల్ల‌ను అక్క‌డ ఏర్పాటు చేసేందుకు అనువైన చోటు కోసం ప్ర‌భుత్వం వెతుకులాట ప్రారంభించింది. బెల్లారీ రోడ్డులోని కొత్త భ‌వ‌న స‌ముదాయాల్లోకి లోకాయుక్త‌ను మార్చే అవ‌కాశ‌ముంది. హంద్రీ నీవా సుజ‌ల స్ర‌వంతి నీటి పారుద‌ల కార్యాల‌యాల కోసం కొత్త‌గా రూపొందించిన భ‌వ‌నాన్ని హెచ్ఆర్సీకి కేటాయించే వీలుంది. మ‌హిళా క‌మిష‌న్‌ను కూడా త్వ‌ర‌లోనే క‌ర్నూలుకు త‌ర‌లించే ఆస్కార‌ముంది.