థియేటర్లలోనే రిలీజ్ చేద్దామనుకున్నాం కానీ..

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కేవలం నటుడే కాదు.. నిర్మాత కూడా. అతను ఇప్పటికే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో నిర్మాతగా మారాడు. గత ఏడాదే కమెడియన్ సత్యను హీరోగా పెట్టి ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను మొదలుపెట్టాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించిన సత్య హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథతో అతణ్ని హీరోను చేశాడు సందీప్. ‘వివాహ భోజనంబు’ ట్రైలర్ చూస్తే సినిమా ఒక నవ్వుల విందు అనే సంకేతాలు కనిపించాయి.

రూపాయి రూపాయి చూసుకుని ఖర్చు చేసే ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడి ఇంట్లోకి బంధుగణం పెద్ద ఎత్తున ఊడిపడ్డ సమయంలో లాక్ డౌన్ కారణంగా అందరూ అక్కడే ఇరుక్కుపోతే ఆ కుర్రాడు పడే కష్టాల నేపథ్యంలో చాలా సరదాగా సాగిపోయేలా కనిపిస్తోందీ చిత్రం. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవాళ్లేమో అన్న అభిప్రాయం ట్రైలర్ చూసినపుడు కలిగింది.

ఐతే ‘వివాహ భోజనంబు’ ఓటీటీ బాట పట్టింది. శుక్రవారం సోనీ లివ్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ ఓటీటీలో రిలీజవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. మధ్యలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారం నిజం కాలేదు. ఐతే తాము ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవమే అని నిర్మాత సందీప్ కిషన్ తెలిపాడు.

“వివాహ భోజనంబు ఒక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా థియేటర్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. దీంతో ఓటీటీకి వెళ్లాలనుకున్నాం. కానీ ఈ మధ్య మళ్లీ థియేటర్లు తెరుచుకుని మళ్లీ జనాలు థియేటర్లకు వస్తుండటంతో పెద్ద తెరల్లోనే సినిమాను రిలీజ్ చేద్దామా అని అనుకున్నాం. కానీ మాకు ఓటీటీ నుంచి చాలా మంచి ఆఫర్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా మంచిదనిపించింది. నాతో పాటు మిగతా నిర్మాతలం కూడా కలిసి ఆలోచించుకుని ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నాం” అని సందీప్ అన్నాడు.