మంత్రి మల్లారెడ్డికి ఎందుకంత కాలింది? రేవంత్ సక్సెస్

మంత్రి మల్లారెడ్డి వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నట్లు మొదలైన మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ చేపట్టిన దీక్ష ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్ చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది.. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో వాస్తవాలు తెలిపేందుకే తాను దీక్ష చేపట్టినట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాల చిట్టా చదివారు. ఎంత భూమి అక్రమించిందన్న విషయంతో పాటు అక్రమాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల కాలంలో ఆయనపై ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎవరూ చేయలేదేమో? ఇంతకీ రేవంత్ నోటి నుంచి వచ్చిన ఆ వ్యాఖ్యల్ని చూస్తే.. ‘నేను దీక్ష చేపట్టి 24 గంటలైంది. పాలు అమ్మేవాళ్లు రాలేదు. నీళ్లు అమ్మే వాళ్లు రాలేదు. భూములు కబ్జాలు చేసే వాళ్లు రాలేదు. జోకర్ మల్లన్న కూడా రాలే. ఈ భూమ్మీద జోకర్లను చూశాం. బ్రోకర్లను చూశాం. కానీ.. పాల మల్లిగాడు సగం జోకర్.. సగం బ్రోకర్. వేదికలెక్కి జోకర్ లా మాట్లాడతారు. వేదిక దిగితే భూముల బ్రోకర్ లా మాట్లాడతాడు. ఎవరు భూములు అమ్మినా.. కొన్నా ఈ పాల మల్లిగాడికి కమిషన్ ఇవ్వాల్సిందే’ అంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.

ఇంతలా మాటలు అన్న తర్వాత మంత్రి మల్లారెడ్డి ఊరికే ఉంటారా? రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఆగ్రహంలో ఆయన బ్యాలెన్సు మిస్ అయ్యారు. మామూలుగానే మంత్రి మల్లారెడ్డి మాటలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందులోకి ఆగ్రహం తన్నుకొచ్చినప్పుడు.. తనను తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రేవంత్ ను ఊరికే వదలకూడదని అనుకున్నారో ఏమో కానీ.. రాయలేని తిట్లు తిట్టేశారు. మొత్తానికి మంత్రి మల్లారెడ్డిని బ్యాలెన్సు మిస్ అయ్యేలా చేయటంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంతేకాదు.. తన లక్ష్యమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆ తర్వాత టార్గెట్ మంత్రి మల్లారెడ్డినే. తాను అనుకున్నట్లుగా ఇరువురు నేతలపై ఫైర్ అయ్యారు రేవంత్.

తనపై ఎవరేమన్నా కూడా వెంటనే రియాక్టు కావటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు ఉండదు. అన్నింటికి కలిపి వడ్డీతో సహా విరుచుకుపడటం ఆయనకు అలవాటు. కాకుంటే కాస్త సమయం ఇస్తారు. సీఎం కేసీఆర్ కున్నంత ప్లానింగ్ మంత్రి మల్లారెడ్డికి ఉండకపోవటం.. తనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ పై బ్యాలెన్సు మరిచి విరుచుకపడ్డారు. దీంతో.. తాను అన్న మాటలకు వెంటనే రియాక్షన్ వచ్చేలా రేవంత్ ప్లాన్ చేసుకున్న వ్యూహం వంద శాతం వర్కువుట్ అయ్యిందని చెప్పాలి.