రెండేళ్లు మూడు రాజ‌ధానులు క‌లేనా.. ఇక మ‌ర్చిపోవ‌డ‌మే ?

ఏపీ రాజ‌ధానిపై గ‌త కొద్ది రోజులుగా నెల‌కొన్న అనిశ్చితి ఇప్ప‌ట్లో వీడేలా లేదు. ఏపీ ఏర్ప‌డిన తొలి ఐదేళ్లలోనే కాదు.. ఇప్పుడు ప్ర‌భుత్వం మారి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌కు కూడా రాజ‌ధాని వ్య‌వ‌హారం రోజు రోజుకు వెన‌క్కు వెళ్లిపోతోంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు చివ‌రి రెండేళ్లు రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ హ‌డావిడి చేశారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న తేవడం.. అది ఇప్ప‌ట‌కీ ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో అస‌లు ఏపీకి ఏది రాజ‌ధానో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఓవ‌రాల్‌గా చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఏపీ రాజ‌ధాని అనేదే లేకుండానే కాలం ముగిసేలా క‌నిపిస్తోంది. తాజా ప‌రిణామాలు దీనికి మ‌రింత ఊతం ఇస్తున్నాయి.

ఇక కోర్టుల్లో ఇప్ప‌టికే రాజ‌ధాని అంశం యేడాదిన్న‌ర కాలంగా న‌లుగుతూ వ‌స్తోంది. ఇది ఎంత‌కు తేలే ప‌రిస్థితి లేదు. దీంతో హైకోర్టు ఏపీ రాజ‌ధాని అంశంపై న‌వంబ‌ర్ 15వ తేదీ నుంచి ప్ర‌తి రోజు విచారించేలా నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇది కూడా త్వ‌ర‌గా పూర్త‌వుతుంద‌ని న‌మ్మ‌లేం..! న‌వంబ‌ర్ 15 నుంచి రోజు విచార‌ణ‌కు తీసుకున్నా కూడా వ‌చ్చే వేస‌వి వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు పూర్త‌వుతోంది. మ‌రో రెండున్న‌రేళ్లు ఆయ‌న అధికారంలో ఉంటారు. ఈ రెండున్న‌రేళ్ల‌లో సైతం జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యాన్ని ఓ కొలిక్కి తెస్తార‌ని మాత్రం ఊహించ‌లేం..! చివ‌రి యేడాది ఎలాగూ ఎన్నిక‌ల వ్య‌వ‌హారాలు, హ‌డావిడే ఉంటుంది. అంటే మ‌రో యేడాదిన్న‌ర‌లో రాజ‌ధాని ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. ఎంత కోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినా కూడా మ‌రో యేడాదిలో రాజ‌ధాని ప్ర‌క్రియ పూర్త‌వ్వ‌డం క‌ష్టంగానే ఉంది.

ఇక కోర్టుల నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే ఇప్పుడు ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తూనే ఉన్నాం. జీతాల‌కే దిక్కూ దివాణం లేదు. చివ‌ర‌కు రోడ్ల ప‌నుల కోసం సైతం టెండ‌ర్లు పిలిస్తే కాంట్రాక్ట‌ర్లు కూడా అటు వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు. ప‌నులు చేస్తే బిల్లులు రావ‌న్న విష‌యంపై వారికి స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఉండ‌డంతోనే అస‌లు ఏపీలో ప‌నులు చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఏదేమైనా ఏపీకి తొలి, మ‌లి ప్ర‌భుత్వాల పాల‌న‌లో రాజ‌ధాని అన్న‌ది పెద్ద క‌ల‌గానే మిగిలి పోనుంది.