చరణ్ కథతో ‘కేజీఎఫ్’ స్టార్..!

కన్నడ హీరో యష్ కు ‘కేజీఎఫ్’ సినిమా భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చాలా మంది దర్శకులు యష్ తో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా యష్ కోసం ఓ కథ అనుకుంటున్నారు. ‘అఖండ’ సినిమా తరువాత బోయపాటి-యష్ ల మధ్య సిట్టింగులు జరగబోతున్నాయని సమాచారం. అయితే యష్ కోసం బోయపాటి కొత్తగా కథేం రాయడం లేదు.

ఇప్పటికే తన దగ్గరున్న కథను యష్ కి తగ్గట్లుగా మార్చబోతున్నారట. బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో ‘వినయ విధేయ రామ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ అయింది. నిజానికి ఈ కథ కంటే ముందు చరణ్ కి మరో కథ చెప్పారట బోయపాటి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మరింత ఎక్కువగా ఉండడంతో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ కథను ఎంపిక చేసుకున్నారు. కానీ చరణ్ అంచనా తప్పింది. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ బోయపాటి చెప్పిన మరో కథతో చరణ్ సినిమా చేద్దామనుకున్నారు.

అదే విషయాన్ని బోయపాటికి కూడా పలు సార్లు చెప్పారట. కానీ ప్రస్తుతం చరణ్ ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా.. ఇప్పట్లో బోయపాటితో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే బోయపాటి తన దగ్గర ఉన్న కథను యష్ కి అనుగుణంగా మార్చుతున్నారని సమాచారం. యష్ కి కూడా తెలుగులో నేరుగా సినిమా చేయాలనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనుకున్నారు కానీ సెట్ కాలేదు. ఇప్పుడు బోయపాటితో సినిమా వర్కవుట్ అవుతుందేమో చూడాలి!