24 మందిపై క్రిమినల్ కేసులా ?

రాష్ట్రంలోని 24 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నట్లు తాజాగా వెలుగులోకొచ్చింది. వీరిలో వైసీపీకి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలే ఎక్కువ మందున్నారు. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. 2019-21 మధ్య జరిగిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వివరాలు సేకరించినట్లు ఏడీఆర్ చెప్పింది. సెక్షన్ 8 (1), (2), (3) ప్రకారం వీళ్ళ పై నమోదైన కేసులు రుజువైతే తీవ్రమైన శిక్ష పడటం ఖాయమట.

ఒకసారి శిక్షపడితే వీళ్ళందరి పై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్ ప్రకటించింది. శిక్షాకాలం మొదలైన రోజు నుంచి అనర్హత వేటు అమల్లోకి వచ్చేస్తుంది. అలాగే జైలు నుంచి విడుదలైన రోజు నుంచి అనర్హత వేటు మొదలవుతుందట. అంటే జైలునుండి విడుదలైన ఆరేళ్ళపాటు శిక్ష అనుభవించిన ప్రజాప్రతినిధులు ఏ ఎన్నికల్లోను పోటీ చేయడానికి లేదు. అలాగే ఎలాంటి పదవులను అందుకోకూడదు.

ఇక ఏడీఆర్ జాబితాలో వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మార్గాని భరత్, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఇక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో పాటు మరో 17 మంది ఎంఎల్ఏలున్నారు. అలాగే టీడీపీ ఎంఎల్ఏల్లో కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. వీళ్ళు కాకుండా తెలంగాణలో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఉన్నారు.

నిజానికి వీళ్ళందరి పైన నమోదైన కేసుల్లో ఎక్కువగా ప్రజాందోళనల్లో పాల్గొన్నవే అయ్యుంటాయి. ఒక్కోసారి వీళ్ళ దూకుడు స్వభావం వల్ల నమోదైన కేసులు కూడా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారనే కేసు మిథున్ పై నమోదైంది. బహుశా ఇలాంటి కేసులే ప్రజాప్రతినిధులపై ఎక్కువగా నమోదయ్యుంటాయి. ఏదేమైనా ప్రజాప్రతినిధులన్నపుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందే. కాబట్టి ఇపుడు కేసులను ఎదుర్కోవాల్సిందే తప్పదు.