తలైవి వచ్చేస్తోంది

ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయాక కరోనా దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన ప్రముఖ చిత్రాల్లో ‘తలైవి’ ఒకటి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎ.ఎల్.విజయ్ రూపొందించిన ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరగడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు.

మళ్లీ దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడిచే రోజుల కోసం ఎదురు చూస్తున్న చిత్ర బృందం.. ఎట్టకేలకు కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో తమ సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించేసింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ‘తలైవి’ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు వాడైన విష్ణు ఇందూరి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడు కావడం విశేషం.

ఉత్తరాదిన ఇప్పటికీ థియేటర్లు పూర్తి స్థాయిలో నడవట్లేదు. కాకపోతే గతంతో పోలిస్తే కాస్త మెరుగు. ఇటీవలే అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ను ధైర్యం చేసి రిలీజ్ చేసేయడం తెలిసిన సంగతే. కానీ ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం వచ్చింది. కాకపోతే ‘తలైవి’ సినిమాను ఇంకెంతో కాలం ఆపి ఉంచే పరిస్థితి లేదు. తమిళనాట తాజాగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేశారు. జయలలిత మీద తీసిని సినమా కాబట్టి ‘తలైవి’కి దక్షిణాదిన మంచి వసూళ్లు వస్తాయన్న ఆశ ఉంది. అందుకే ఇక్కడి మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో రిలీజ్ డేట్ ఇచ్చేశారు.

ఈ చిత్రంలో జయలలిత పాత్రను పోషించడం కోసం కంగనా చాలానే కష్టపడింది. బాగా లావై తన అవతారాన్ని మార్చుకుంది. మేకప్ కూడా తోడవడంతో జయలలితగా కంగనా అవతారం ఆకర్షణీయంగానే మారింది. ఇక ఆమె ఎంత మంచి పెర్ఫామరో తెలిసిందే కాబట్టి ‘తలైవి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 10న తెలుగులో ‘లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.