జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్?

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి ఏకంగా తెలంగాణ హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్ పెట్టినట్టు అయింది. వెంటనే సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.. జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో వ్యవహారాలు అదుపుతప్పి నడుస్తున్నందున సొసైటీ పర్యవేక్షణకు, నియంత్రణకు స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. తెలంగాణా కో ఆపరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రార్‌-కమ్‌-కమిషనర్‌ ను తాజాగా ఆదేశించింది.

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ సెక్రటరీ ఎ.మురళీముకుంద్‌ స్పెషలాఫీసర్‌ నియామకం కోరుతూ పిటిషన్‌ వేయడంతో హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అలాగే హౌసింగ్‌ సొసైటీ సెక్రటరీ అధికారాలు తొలగిస్తూ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఈ నెల 12 న జారీ చేసిన నోటీసు ను కూడా తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.

అలాగే మురళీ ముకుంద్‌ పిటిషన్‌ను పరిశీలించి ప్రతివాదులైన సహకారశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, సహకార సొసైటీల రిజిస్ట్రార్‌, జూబ్లీహిల్స్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ బొల్లినేని రవీంద్రనాథ్‌కు నోటీసులు జారీ చేసింది.

సొసైటీ సెక్రటరీగా తన హక్కులకు ప్రెసిడెంట్‌, ఇతర మేనేజింగ్‌ కమిటీ సభ్యులు భంగం కలిగిస్తున్నారని, మీటింగ్స్‌కు కూడా రానివ్వడంలేదనీ, తన బాధ్యతలను నిర్వర్తించనివ్వడం లేదని పిటిషన్‌లో మురళీముకుంద్‌ పేర్కొన్నారు. పిటిషనర్‌ అభ్యర్థించిన మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయని బెంచ్‌ పేర్కొంది.