సంక్రాంతి సినిమాలు.. ఏంటీ కొత్త గంద‌ర‌గోళం?

సంక్రాంతి సినిమాల‌పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చేసిన‌ట్లే అనుకుంటున్న త‌రుణంలో టాలీవుడ్లో ఉన్న‌ట్లుండి పుట్టుకొచ్చిన రూమ‌ర్లు గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌య్యాయి. జ‌న‌వ‌రి 12, 13, 14 తేదీల్లో వ‌రుస‌గా భీమ్లా నాయ‌క్, స‌ర్కారు వారి పాట‌, రాధేశ్యామ్ చిత్రాక‌లు రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇవి ఆయా తేదీల్లో రావ‌డం ప‌క్కా అనే అనుకుంటున్నారంతా. కుదిరితే ‘ఎఫ్-3’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే తెస్తారని కూడా అంటున్నారు. దాని సంగతి ఎలా ఉన్నా.. ప్రేక్షకులు సంక్రాంతికి పై మూడు చిత్రాల మధ్య త్రిముఖ పోటీకి మానసికంగా సిద్ధమైపోయారు.

కానీ ఉన్నట్లుండి టాలీవుడ్లో సంక్రాంతి చిత్రాల షెడ్యూల్లో మార్పు అంటూ మొదలైన ఓ ప్రచారం అయోమయానికి తెరలేపింది. పవన్ సినిమా ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి విడుదల కాదని.. ఆ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న రిలీజ్ చేయబోతున్నారని.. దాని స్థానంలోకి చిరంజీవి సినిమా ‘ఆచార్య’ రాబోతోందన్నదే ఈ రూమర్.

‘ఆచార్య’ను వాస్తవానికి దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లే ఆ చిత్ర వర్గాల సమాచారం. ఆ పండక్కి ‘ఆర్ఆర్ఆర్’ రావడం దాదాపు అసాధ్యం అని తేలిపోయిన నేపథ్యంలో చిరు చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాన్ని సంక్రాంతి వరకు ఎందుకు ఆపుతారన్నది అర్థం కాని విషయం. పైగా ‘భీమ్లా నాయక్’కు ఒకసారి డేట్ ఇచ్చాక ఇలా మార్చాల్సిన అవసరమూ కనిపించదు.

సోలోగా రిలీజ్ చేస్తే మరోసారి పవన్ సినిమాను ‘వకీల్ సాబ్’ తరహాలో ఏపీలో జగన్ సర్కారు టార్గెట్ చేయొచ్చనే సందేహాలు కూడా ఉన్నాయి. అలాంటపుడు సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకునే అవకాశాలు తక్కువ. కానీ ఎలా మొదలైందో ఏమో కానీ.. బుధవారం సాయంత్రం నుంచి ఈ రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. మెగా అభిమానులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ మార్పును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు వేశారు. కానీ ఇటు ‘ఆచార్య’ టీం నుంచి కానీ.. అటు ‘భీమ్లా నాయక్’ బృందం నుంచి ఈ రకమైన సంకేతాలైతే కనిపించడం లేదు.