మూడో సారి వ్యాక్సిన్ కుదరదు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ముందుగా.. కోవాగ్జిన్, కోవీషీల్డ్… ఈ రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ నే తీసుకున్నారు. చాలా మందివి రెండు డోసులు తీసుకోవడం కూడా పూర్తైంది. కాగా.. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్న వ్యక్తి.. మళ్లీ మరో వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంటే.. కోవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వ్యక్తి మళ్లీ కోవిషీల్డ్ తీసుకోవచ్చా..? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాక మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని తెలిపింది. ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు కోవిషీల్డ్ వేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.

తాను సౌదీ అరేబియాలో పని చేస్తున్నానని, కోవాగ్జిన్‌ వేసుకున్నవారిని అక్కడ అనుమతించడం లేదని, కాబట్టి తనకు మళ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని కోరాడు. ఈ పిటిషన్‌కు కేంద్రం సమాధానం చెప్పింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తికి రీ-వ్యాక్సినేషన్ ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికి ఒక వ్యక్తికి కేవలం రెండు డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే అందిస్తున్నాం. అంతకంటే ఎక్కువ ఇస్తే అనారోగ్య సమస్యలు తలత్తే అవకాశాలున్నాయి. అలా ఇవ్వాలని ఇంటర్నేషనల్ గైడ్ లెన్స్‌ కూడా సూచించడం లేదు. కాబట్టి సదరు పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేం. అతని అభ్యర్థనకు అనుమతిస్తే... రీ-వ్యాక్సినేషన్ కోసం మరికొంత మంది కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.