అభివాదం చేసి చేసీ.. నీరజ్ చోప్రాకి అస్వస్థత

నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే.. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినపడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి వందేళ్ల భారతీయుల కల నెరవేర్చిన బల్లెం వీరుడు ఈ నీరజ్‌ చోప్రా. భారతీయుల స్వర్ణం కల నెరవేర్చిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా.. ఈ ఒలంపిక్ విజేత అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు.

ఢిల్లీలో ప్రధాని మోడీతో విందు అనంతరం స్వగ్రామం హర్యానాలోని పానిపట్‌ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్‌ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్‌ అస్వస్థతకు గురయ్యాడు.

ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్‌ నీరసించిపోయాడు. హై ఫీవర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత కొన్నిరోజులుగా నీరజ్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్‌ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్‌ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు

మరోవైపు ఒలింపిక్స్‌ లో గోల్డ్ మెడల్ సాధించి తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్‌ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం పాలయ్యాడు.