టాలీవుడ్ అటెన్షన్.. కుర్రాడు ఏం చేస్తాడో?


ఇప్పుడు టాలీవుడ్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా ‘పాగల్’. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి కానీ.. అవి అనుకున్నంతగా కళకళలాడటం లేదు. తొలి రెండు వారాల్లో తిమ్మరసు, ఎస్ఆర్ కళ్యాణమండపం ఓ మోస్తరుగా ఆడినప్పటికీ.. థియేటర్లను హోరెత్తించే విజయం కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఆ విజయాన్ని ‘పాగల్’ అందిస్తుందనే ఆశ టాలీవుడ్లో కనిపిస్తోంది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విశ్వక్సేన్ హీరో కావడం.. అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మించడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

‘పాగల్’ టీజర్, ట్రైలర్ సహా అన్ని ప్రోమోలూ ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించిందీ చిత్రం. కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి ఒక కొత్త థాట్‌తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా సినిమాకు మంచి టాక్ రావడమే.

మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో ‘పాగల్’ గురించి ఒక రేంజిలో హైప్ ఇచ్చాడు విశ్వక్సేన్. మూసుకున్న థియేటర్లు కూడా తెరిపిస్తా ఈ సినిమాతో అంటూ అతను చేసిన కామెంట్ సెన్సేషనల్ అయింది. అంత ధీమా వ్యక్తం చేశాడంటే సినిమాలో ఏదో ఒక విశేషం ఉంటుందనే అనుకుంటున్నారంతా. విశ్వక్ అతి చూసి సినిమా పోవాలని కోరుకుంటున్న వాళ్లూ లేకపోలేదు కానీ.. కరోనా దెబ్బకు కుదేలైపోయిన ఇండస్ట్రీకి ప్రతి విజయం కీలకమే.

యూత్‌లో మంచి క్రేజే సంపాదించుకున్న ‘పాగల్’.. మంచి టాక్ తెచ్చుకుని థియేటర్లను కళకళలాడిస్తే, హిట్ స్టేటస్ అందుకుంటే.. మరిన్ని పేరున్న చిత్రాలు థియేటర్లలోకి దిగుతాయి. ఇప్పటికే రిలీజ్ ఖరారు చేసుకున్న చిత్రాలకు కలిసొస్తుంది. అలాగే లవ్ స్టోరి సహా కొన్ని క్రేజీ మూవీస్ ధైర్యంగా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతాయి. కాబట్టి ‘పాగల్’ సక్సెస్ కావడం ఇండస్ట్రీకి చాలా అవసరం. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో?