భారీ చిత్రం తుస్సుమంది


ఒకవైపు అజయ్ దేవగణ్.. ఇంకోవైపు సంజయ్ దత్.. ఇంకా సోనాక్షి సిన్హా, శరద్ ఖేద్కర్, ప్రణీతా సుభాష్, నోరా ఫతేహి లాంటి పేరున్న తారాగణం.. భూషణ్ కుమార్ సహా ఐదారుగురు పేరున్న నిర్మాతల భాగస్వామ్యం.. అన్నింటికీ మించి భారత దేశ చరిత్రలో కీలక పరిణామాల్లో ఒకటిగా చెప్పుకునే 1971 నాటి భుజ్ యుద్ధ నేపథ్యంలో అల్లుకున్న దేశభక్తి కథ.. ఇవన్నీ కలిసి ‘భుజ్: ది ప్రైడ్’ మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి. ఐతే ఆ అంచనాలన్నీ శుక్రవారం కూలిపోయాయి.

హాట్ స్టార్ ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇండియాలో ఓటీటీ ద్వారా రిలీజైన అతి పెద్ద సినిమాల్లో ఒకటైన ‘భుజ్’.. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమా కోసం నిరీక్షిస్తున్న ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది. పోయినేడాది కరోనా టైంలోనే ఈ చిత్రాన్ని హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి ఆ చిత్రం మేకింగ్ దశలో ఉంది. కరోనా బ్రేక్ తర్వాత సినిమాను పూర్తి చేసి, సెకండ్ వేవ్ కూడా అయ్యాక ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఐతే ఈ తరహా చిత్రాల్లో ప్రేక్షకులను భావోద్వేగాలను గురి చేయడం.. దేశభక్తి భావనను తీసుకురావడం కీలకం.

ఐతే సినిమా అంతటా ఆర్టిఫిషియల్ ఎమోషన్ తప్పితే సహజంగా ప్రేక్షకుల్లో భావోద్వేగాలు తట్టి లేపే అంశాలే లేకపోయాయి. అసహజంగా అనిపించిన చాలా ఎపిసోడ్లు సినిమా మీద ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేశాయన్నది మెజారిటీ ప్రేక్షకులు అంటున్న మాట. విజువల్ ఎఫెక్ట్స్‌లో భారీతనం చూపించే క్రమంలో సహజత్వం లోపించడంతో సినిమా పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పూర్తిగా నెగెటివ్ రివ్యూలే వస్తున్నాయి ఈ చిత్రానికి. బాలీవుడ్ క్రిటిక్స్ అటు ఇటుగా ‘2’ రేటింగ్‌కు పరిమితం చేస్తున్నారు. లక్ష్మి, బిగ్ బబుల్ తరహాలోనే హాట్‌స్టార్‌ రిలీజ్ చేసిన మరో డిజాస్టర్ మూవీ అంటూ ‘భుజ్’ను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.