రిలీజ్ డేట్ల జాతర.. కొత్తగా ఇంకో రెండు


టాలీవుడ్లో మళ్లీ కొత్త సినిమాలకు రిలీజ్ కళ కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక తొలి రెండు వారాలు అంతగా సందడి లేదు. తిమ్మరసు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలకు ఉన్నంతలో మంచి ఫలితమే వచ్చినా సరే.. నెక్స్ట్ లెవెల్ క్రేజీ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ వారం ‘పాగల్’ కొంత మేర లోటు తీర్చేలాగే కనిపిస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో యూత్‌లో మంచి క్రేజున్న విశ్వక్సేన్ నటించిన సినిమా కావడంతో దీనికి హైప్ బాగానే కనిపిస్తోంది.

రాజు ధైర్యం చేయడంతో మిగతా నిర్మాతల్లోనూ ధైర్యం వచ్చినట్లే ఉంది. వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చే వారానికి ‘రాజ రాజ చోర’ లాంటి క్రేజీ మూవీ షెడ్యూల్ అయిపోయింది. ఇక ఆగస్టు చివరి వారానికి మూడు చిత్రాలు రేసులోకి రావడం, ఆ మూడూ కూడా ఆసక్తి రేకెత్తించేవే కావడం విశేషం.

ఇప్పటికే సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ఆగస్టు 27కు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి గురువారం ప్రకటన వచ్చింది. 24 గంటలు తిరక్కముందే అదే తేదీకి మరో రెండు చిత్రాల రిలీజ్ ఖరారైంది. ‘చి ల సౌ’తో ఫాంలోకి వచ్చాక అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ చేసిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ను ఆగస్టు 27నే రిలీజ్ చేస్తున్నట్లు ఈ రోజు ఉదయం ప్రకటించారు. ఈ చిత్రం ఫస్ట్ కాపీతో ఆర్నెల్ల ముందే రెడీ అయినా.. సరైన టైమింగ్ కోసం ఎదురు చూసి చూసి ఎట్టకేలకు రిలీజ్ ప్రకటించారు.

మరోవైపు శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ను కూడా ఆగస్టు 27నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు, క్రిష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇది హిందీ మూవీ ‘బాలా’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ నెలలో ఆగస్టు చివరి వారానికే అత్యంత పోటీ కనిపిస్తోంది. మూడు క్రేజీ చిత్రాలు రిలీజ్ కానుండటంతో ఆ రోజు బాక్సాఫీస్‌కు మంచి ఊపొచ్చేలాగే కనిపిస్తోంది.