హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లే లేనట్లేనా ?

తెలంగాణాలో రోజు రోజుకు టెన్షన్ పెంచేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇఫ్పట్లో జరిగేట్లు లేదు. ఉపఎన్నిక నిర్వహించేందుకు అనువైన పరిస్ధితులు ఉన్నాయా ? లేవా ? అనే విషయమై నివేదిక ఇవ్వాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ను కోరింది. అలాగే రాష్ట్రప్రభుత్వానికి కూడా మరో లేఖ రాసింది. రెండు నివేదికలు అందిన తర్వాత గానీ హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించి నిర్ణయం తీసుకోదు.

గతంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలోనే తమిళనాడులో కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఎలాంటి నిబంధనలను పాటించకుండానే ఎన్నికలను నిర్వహించటంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంపై ఎంత సీరియస్ అయిపోయిందో అందరికీ తెలిసిందే. దాని దెబ్బకు తర్వాత జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంది ఎన్నికల సంఘం.

న్యాయస్ధానం వేసిన అక్షింతల కారణంగా సాధారణ ఎన్నికలు తప్ప ఉపఎన్నికల జోలికి కేంద్ర ఎన్నికల సంఘం వెళ్ళటంలేదు. దేశవ్యాప్తంగా సుమారు 103 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగాలి. వీటన్నింటినీ కేవలం కోవిడ్ కేసులను కారణంగా చుపుతునే కేంద్ర ఎన్నికల సంఘం వాయిదాలు వేస్తోంది. కాబట్టి ఇదే సూత్రం ఇఫుడు తెలంగాణాలోని హుజూరాబాద్, ఏపిలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలకూ వర్తిస్తుంది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాల ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా చూపించి స్వయంగా కేసీయారే వాయిదా వేయించారు. నిజానికి ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎంఎల్సీ ఎన్నికలకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అయితే ఏకగ్రీవమైపోతాయి. లేకపోతే ఎన్నికల నిర్వహణ తప్పదు. ఎంత ఎన్నికలు నిర్వహించినా ఓట్లు వేయాల్సింది 119 మంది ఎంఎల్ఏలే. అలాంటి ఎన్నికలనే కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించినపుడు ఇక లక్షలాదిమంది ఓటర్లు పాల్గొనే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణ ఇంకెంత కష్టం ?

కేంద్ర ఎన్నికల కమీషన్ ఆలోచనలు చూస్తుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇఫ్పట్లో జరిగేట్లు కనబడటంలేదు. కనీసం సెప్టెంబర్ 15లోపు అయితే సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఉపఎన్నికలు నిర్వహించాల్సిన మొత్తం 103 నియోజకవర్గాలున్న రాష్ట్రప్రభుత్వాలకు, ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల కమీషనర్లకు కేంద్ర ఎన్నికల కమీషన్ లేఖలు రాసింది. రాష్ట్రాల నుండి నివేదికలు అందాలి, వాటిని కేంద్ర ఎన్నికల కమీషన్ పరిశీలించాలి. ఆ తర్వాత కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అందుకనే ఉపఎన్నిక ఇపుడిప్పుడే జరిగేట్లు లేదంటున్నారు. చూడాలి మరి చివరకు ఏమి జరుగుతుందో.