ఏపీలో చెలిమి పేరిట క‌మ‌లం చెల‌గాటం ?

ఏపీలో రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. ఒక వైపు వైసీపీ అధికారంలో ఉంది. మరో వైపు టీడీపీ విపక్షంలో ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలకే ఏపీలో బేస్ ఉంది. జనాల్లో ఆదరణ ఉంది. అయితే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఈ పార్టీలను ఒక ఆట ఆడించేస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలని, తన మాటే వినాలని కావాలనే వెంట తిప్పుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ రెండు పార్టీలకు ఉన్న ఇబ్బందులు, గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా బీజేపీని వీడలేని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. దాంతో మిగిలిన పార్టీలకు ఈ రెండు పార్టీల పొలిటికల్ స్టాండ్ ఏంటో అసలు అర్ధం కావడంలేదు.

కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని అతి పెద్ద ప్రయత్నం జరుగుతోంటే ఏపీ నుంచి మాత్రం ఈ రెండు పార్టీల ఉలుకూ పలుకూ అసలు లేవు. ఏపీలో బీజేపీతో చేతులు కలిపి ముందుకు సాగాలని టీడీపీ చూస్తోంది. అదే టైమ్ లో బీజేపీ టీడీపీ అసలు కలవకూడదు అన్న ఒకే ఒక అజెండాతో వైసీపీ పనిచేస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం ఇష్టం లేకపోయినా అనివార్యంగా బీజేపీతో స్నేహం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ ఆ విధంగా మద్దతు ఇస్తోంది.

దీని వల్ల వైసీపీకి వ్యక్తిగతంగా కానీ ఏపీకి అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా పంటి బిగువున బీజేపీతో చెలిమి చేస్తున్నట్లుగా వైసీపీ రాజకీయ నాటకమే ఆడుతోంది అంటున్నారు. ఇక టీడీపీది అదే సీన్. వైసీపీ, బీజేపీ కలసికట్టుగా ఉంటే ఏపీలో తన రాజకీయం పండదు అనేదే టీడీపీ లెక్క. అందుకే ఎలాగైనా వైసీపీ నుంచి బీజేపీని విడగొట్టాలన్నది టీడీపీ పంతం పట్టుదల. అవసరం అయితే తాను బీజేపీ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ అంటూ పసుపు పార్టీ సంకేతాలు పనంపుతోంది. బీజేపీ విషయం తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను అలా తన చెప్పుచేతలలో ఉంచుకోవాలన్నదే వ్యూహం.

వైసీపీని చేరదీస్తున్నట్లుగా కనిపిస్తూనే టీడీపీకి కూడా దూరం కాకూడదు అన్న ఎత్తుగడ. వీటికి మించి బీజేపీకి ఉన్న మరో ప్లాన్ ఏంటి అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు యాంటీ మోడీ క్యాంప్ లో చేరకూడదు. అందుకోసం వాటితో చెలిమి పేరిట కమలం చెలగాటమే ఆడుతోంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో స్నేహాలు ఏవీ ఉండవు. అన్నీ అవసరాలే. అందువల్ల అలాంటి అవసరాలతో ఏపీలో మూడు పార్టీల మధ్య అతి పెద్ద రాజకీయ దోబూచాట సాగుతోంది. ఇందులో విజేతలు ఎవరు అన్నది 2024 ఎన్నికల ఫలితాలు వస్తేనే తప్ప తెలియదు.