కేటీఆర్ గారు… ఈటల విష‌యంలో ఇదేం లెక్క‌?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు చేసే రాజ‌కీయం ఎంత విభిన్నంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న పార్టీకి సంబంధించిన నిర్ణ‌యాల ప‌రంగా చూసినా ఇటు ప‌రిపాల‌న విష‌యంలోనూ గులాబీ ద‌ళ‌ప‌తి తీరే వేరు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కోబోతుంది. ఈ ఉప ఎన్నిక‌ విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవ‌రికి చాన్స్ ద‌క్క‌నుంద‌న్న విష‌యంలో కొద్దిరోజులుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు తాజాగా తెర‌దించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గెల్లు శ్రీనివాస్‌కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో మరో విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాడారని గుర్తు చేశారు.

ఈ ఉప ఎన్నిక‌కు అన‌ధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్ రావు ఇంచార్జీగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని గెలుపు బాట న‌డిపించేందుకు ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ఆయ‌న‌తో పాటుగా రాష్ట్రానికి చెందిన మంత్రులు సైతం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు కేటీఆర్ ప్ర‌చారం చేయ‌లేదు. గ‌తంలో హైద‌రాబాద్ , వ‌రంగ‌ల్ లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో పాటుగా వివిధ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు తీసుకున్న కేటీఆర్ హుజురాబాద్ విష‌యంలో ఎందుకు సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు త్వ‌ర‌లో అసెంబ్లీకి రాబోతున్నార‌ని పేర్కొంటున్న కేటీఆర్ అభ్య‌ర్థికి ప్ర‌చారం చేసే విష‌యంలో మాత్రం ఎందుకు దృష్టి సారించ‌డం లేద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.