బెల్లంకొండ ముసుగు తొలగింది

టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్లలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ఆది, చెన్నకేశవరెడ్డి, రభస లాంటి భారీ చిత్రాలను ఆయన నిర్మించారు. ఐతే నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన తర్వాత ఆయన జోరు తగ్గింది. కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత మీడియం రేంజిలో రభస, శంభోశివశంభో లాంటి చిత్రాలు నిర్మించాడు సురేష్. తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ పెద్ద బడ్జెట్లో ‘అల్లుడు శీను’ తీశాడు. ఐతే ఆ తర్వాత మాత్రం ఉన్నట్లుండి బెల్లంకొండ సురేష్ సినిమాల నిర్మాణం ఆపేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన నిర్మాణంలో వచ్చిన సినిమాలకు సంబంధించి ఫైనాన్షియర్లతో కొన్ని గొడవలు తలెత్తడమే అందుకు కారణం అంటారు.

తన నిర్మాణంలో సినిమాలు తెరకెక్కితే రిలీజ్ ముంగిట ఫైనాన్షియర్లతో గొడవలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఆయన తన సంస్థను పక్కన పెట్టేసి వేరే వాళ్లను నిర్మాతలుగా పెట్టి వెనుక నుంచి ఆర్థిక సహకారం అందిస్తూ తన కొడుకు చిత్రాలను నిర్మించాడని ఇండస్ట్రీలో గుసగుసలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. లేదంటే శ్రీనివాస్‌ మార్కెట్ కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి జయ జానకి నాయక, సాక్ష్యం లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను బయటి నిర్మాతలు నిర్మించడమేంటి.. అవి కాస్ట్ ఫెయిల్యూర్లు అయినా ఏం పట్టనట్లు ఉండిపోవడమేంటి..? ఈ సినిమాలకు సంబంధించి ఆర్థిక విషయాలన్నీ సురేషే చూసుకున్నాడన్నది ఇండస్ట్రీలో టాక్. ఐతే ఇలాగే ఆరేడేళ్లు గడిచిపోయాయి.

సురేష్ మాత్రం తన సంస్థలో చాలా ఏళ్లుగా మరో చిత్రం నిర్మించలేదు. శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీని సైతం వేరే నిర్మాతే చేస్తున్నాడు. ఇక సురేష్ ఎప్పటికీ తన సంస్థలో సినిమాలు నిర్మించడా అనుకుంటుంటే.. ఇప్పుడాయన సడెన్ రీఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. బెల్లంకొండ వారి బేనర్లో ‘స్టూవర్ట్ పురం దొంగ’ అనే కొత్త చిత్రం రాబోతోంది. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేఎస్ దర్శకుడు. ఈ రోజే ఈ చిత్రాన్ని ప్రకటించారు. మళ్లీ బెల్లంకొండ వారి బేనర్ పేరు.. నిర్మాతగా సురేష్ పేరు పోస్టర్ మీద కనిపించడంతో ఇన్నాళ్లకు సురేష్‌కు ఫైనాన్షియర్లతో గొడవలు సద్దుమణిగాయా.. ఆయన ముసుగు తొలగిందా అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.