ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే

వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్దితి చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్థితి అంచనా వేసుకున్న కమలం పార్టీ అగ్రనేతలు రాబోయే ఎన్నికలపై బీజేపీ విషయంలో జనాభిప్రాయం సేకరించాలని అనుకున్నారు.

ఇందులో భాగంగానే నమో యాప్ అనే యాప్ ను రెడీచేశారు. దీన్ని పై రాష్ట్రాల్లోని జనాలకు పరిచయం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపోటములను ప్రభావితం చేయబోతున్న అంశాలు ఏమిటనే విషయాలను జనాల నుండే నేరుగా తెలుసుకోవాలని కమలం పార్టీ అగ్రనేతల డిసైడ్ చేసుకున్నారు. ఓటేసేటప్పుడు ప్రజలు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు ? అనే విషయమై ప్రధానంగా దృష్టి పెట్టింది.

కోవిడ్-19 నియంత్రణ, వ్యాక్సినేషన్ జరిగిన, జరుగుతున్న విధానం, సంక్షేమ పథకాల అమలు, తమ ప్రజాప్రతినిధుల పనితీరు, అవినీతి, అక్రమాలు, ప్రజలతో సంబంధాలు, ఎవరైతే అభ్యర్థిగా బాగుంటుందని అనుకుంటున్నారు, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, శాంతి-భద్రతలు, విద్యావకాశాలు లాంటి అనేక అంశాలపై బీజేపీ గట్టిగా సర్వే చేయించుకుంటోంది. తమకు వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా బహుశా టికెట్లను డిసైడ్ చేయాలని అనుకుందేమో.

ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్ల కమలం పార్టీ గడ్డు పరిస్ధితులనే ఎదుర్కొంటోంది. పంజాబ్ లో ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా పుంజుకున్న సూచనలు కనబడలేదు. కాకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలేమైనా బీజేపీకి కలిసివస్తుందేమో చూడాలి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీజేపీకి దీటుగా ఆప్ పార్టీ చొచ్చుకుపోతోంది.

ఇవి కాకుండా ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన అకాలీదళ్ వల్ల బీజేపీకి కొంత నష్టం జరిగే అవకాశముంది. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకునే హోలు మొత్తంగా ఐదు రాష్ట్రాల్లోను ఎన్నికల సర్వే చేయించుకుంటోంది. మరి ఫలితాలు ఎప్పుడు వస్తాయో ? ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ అయితే కమలనాథుల్లో పెరిగిపోతోంది. చూద్దాం చివరకు ఏం జరుగుతుందో.