హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్..

అంచనాలు నిజమయ్యాయి. ముందుగా అనుకున్నట్లే హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ముందు నుంచి పేరు వినిపిస్తున్న గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది. కొద్ది సేపటి క్రితం (బుధవారం) టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఆయనే ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ ఇప్పటివరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలకు ధీటుగా అభ్యర్థిని ప్రకటించాలంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండటంతో పాటు.. వెనుకబడి కులానికి చెందిన నేత అయితే సరిగ్గా సరిపోతారు. ఈ కాంబినేషన్లను వర్కువుట్ చేసిన కేసీఆర్.. గెల్లుకు అవకాశం ఇచ్చారు. గెల్లును అభ్యర్థిగా ఎంపిక చేసిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు.. విద్యార్థులు.. యువత నుంచి కూడా మద్దతు లభిస్తుందన్న అంచనాతో ఉన్నట్లు చెబుతున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లలో అత్యధికం దళితులే అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే తెలంగాణ దళిత బంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ కులాలకు చెందిన నేతను బరిలోకి దించితే..కాంబినేషన్ పక్కాగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన్ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయంలో కిందామీదా పడుతోంది. తాజాగా గులాబీ అభ్యర్థి ఎవరన్నదిఅధికారికంగా బయటకు వచ్చేయటంతో.. ఉప ఎన్నిక వేడి మరింత పెరగటంఖాయమని చెప్పాలి.