ప్రవీణ్ణు డైరెక్టు ఎటాక్ చేస్తున్న టీఆర్ఎస్

తాజాగా బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ గా అధికారపార్టీ టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన ప్రవీణ్ పై టీఆర్ఎస్ ఎంఎల్ఏలు వరుసబెట్టి ఆరోపణలు, విమర్శల బాణాలను వదులుతున్నారు. దానికి ఉద్యోగంలో ఉండగా ప్రవీణ్ చేసిన ప్రకటనలను తమ ఆరోపణలు, విమర్శలకు మద్దతుగా ఎంఎల్ఏలు గ్యాదిరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, భాస్కరరావు ఉపయోగించుకుంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి ప్రవేశించటం, బీఎస్పీలో చేరటం ఖాయమవ్వగానే ప్రవీణ్ వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టారు. కేసీయార్ వ్యవహారశైలిపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడుతున్నారు. సరే ప్రతిపక్షమన్నాక ఇదంతా మామూలని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రవీణ్ చేస్తున్న ఆరోపణలు మాత్రం కాస్త విచిత్రంగా ఉన్నాయనే చెప్పాలి.

ఇందుకు కారణాలు ఏమిటంటే మొన్నటివరకు ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రిక్వెస్టు చేసుకుని ఎస్సీ సంక్షేమ శాఖలోని గురుకులాలకు ప్రత్యేక అధికారిగా ఉండిపోయారు. ఐపీఎస్ అధికారిగా కన్నా ఎస్సీల స్కూళ్ళు, హాస్టళ్ళ సంక్షేమం కోసం తాను పనిచేయాలని అనుకుంటున్నట్లు పెట్టుకున్న రిక్వెస్టును కేసీయార్ అంగీకరించారు. అందుకనే సుదీర్ఘకాలం గురుకులాల సంక్షేమం, బలోపేతానికి పాటుపడ్డారు. అధికారిగా ఆయన చేసిన సేవలను ఎవరు తప్పుపట్టడంలేదు.

అయితే గురుకులాలకు ప్రత్యేక అధికారిగా ఉన్న కాలంలో తనకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతును, ప్రోత్సాహాన్ని ప్రవీణ్ చాలాసార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం మద్దతు లేనిదే తాను గురుకులాల బలోపేతానికి కృషి చేయగలిగేవాడిని కాదని చెప్పుకున్నారు. అంటే ఉద్యోగంలో ఉన్నంత కాలం పదే పదే ప్రభుత్వం పనితీరుపై పాజిటివ్ గా మాట్లాడిన ఇదే ప్రవీణ్ బీఎస్పీలో చేరగానే వ్యతిరేకంగా మాట్లాడుతుండటాన్ని ఎంఎల్ఏలు ఎండగడుతున్నారు. తమ ఎదురుదాడికి మద్దుతుగా అప్పట్లో ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో ప్రవీణ్ కృతజ్ఞతలు చెప్పుకున్న పేపర్ కటింగులను చూపిస్తున్నారు. మొత్తానికి ప్రవీణ్ పై టీఆర్ఎస్ ఎంఎల్ఏలు గట్టిగానే ఎటాక్ చేస్తున్నారనే అనుకోవాలి.