కాపు కోటలో ‘తోట’ బలాన్నే న‌మ్ముకున్న జ‌గ‌న్ ?


తూర్పు గోదావరి జిల్లా రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అంతు పట్టదు. ఇక్కడ ఉన్న వారి మనసులు వెన్న. వారికి సమాదరించే గుణం ఉంది. తమ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపరు. గోదారమ్మలా చల్లగా ఉంటారు. కోపం వస్తే అదే గోదారి తల్లిగా ఉగ్రరూపం దాలుస్తారు. వారు అందరినీ నమ్ముతారు. ఎన్ని ఎన్నికలు వచ్చినా నమ్మడం వారి నైజం. ఒకసారి మోసపోతే మాత్రం ఆ ఆవేశం వారి చేత ఏమైనా చేయిస్తుంది. మరి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అతి పెద్ద జనాభా కాపులు. వారు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి కొమ్ము కాశారు. కానీ వర్కౌట్ కాలేదు. అయితే ఆ ఎఫెక్ట్ టీడీపీపై ఘోరంగా ప‌డ‌డంతో టీడీపీ చిత్తు అయిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి, ప్ర‌జారాజ్యానికి నాలుగేసి సీట్లు వ‌చ్చాయి. అందుకే 2014 నాటికి టీడీపీకి జై అనేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి చోటిచ్చారు. తూర్పు తీర్పు ఎటో ఏపీ తీర్పు అటే అన్న నానుడి ఎప్పుడూ నిజ‌మ‌వుతూనే వ‌చ్చింది.

వచ్చే ఎన్నికల్లో వారి రూట్ ఎటూ అన్నదే చర్చగా ఉంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు నాయకులు వైసీపీ వైపు ఉండడం శ్రీరామ రక్ష అంటున్నరు. ఏపీలోని మొత్తం కాపులతో సఖ్యత కలిగిన తోట త్రిమూర్తులును జగన్ బాగానే మచ్చిక చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ పెద్ద పీట వేశారు. ఇదే గోదావరి జిల్లాకు చెందిన మంత్రి కురసాల కన్నబాబు ఉన్నా కూడా ఆయన రాజకీయంగా దూకుడు చేయలేరు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా త‌ర్వాత ఏవేవో కార‌ణాల‌తో ఆయ‌న సైలెంట్ అయిపోయార‌న్న‌ది వాస్త‌వం. క‌న్న‌బాబుతో పార్టీ మారి వ‌చ్చిన తోట‌కు మూడు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. అక్క‌డ కాపుల్లో ప‌ట్టుకోస‌మే మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తోటను జగన్ గట్టిగానే నమ్ముకున్నారు.

అయితే తోట కూడా కొన్ని సార్లు ఓడిన వారే. అంత వరకూ ఎందుకు 2019 ఎన్నికల్లో ఆయన ఓడిన తరువాతనే టీడీపీని వీడారు. అయితే ఆయనకు అంగబలం బాగా ఉంది. కాపు యువతలోనూ క్రేజ్ ఉంది. ఆయన పేరు చెబితే పలికే వారున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే కాపుల్లో నిమ్మకాయల చిన రాజప్ప, బండారు సత్యానంద‌రావు, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, నిమ్మల రామానాయుడు వంటి వారే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. అయితే టీడీపీకి జనసేనతో పొత్తు ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం మారే అవకాశం ఉందని అంటున్నారు.

అది కూడా గెలుపు అవకాశాలు టీడీపీకి ఉంటాయన్న నమ్మకం కుదిరితే కచ్చితంగా కాపులు అటు వైపు పెద్ద ఎత్తున మళ్ళుతారు. ఇపుడు చూస్తే అధికార వైసీపీ మీద కాపులలో పెద్ద ఎత్తున అసంతృప్తి అయితే లేదు. కానీ రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి కాపులకు ప్రత్యేకంగా నిధులు రాకపోయినా కాపు కార్పోరేషన్ కి మాట ఇచ్చినట్లుగా పదివేల కోట్ల రూపాయలను విడుదల చేయకపోయినా అది అధికార పార్టీకి దెబ్బ అవుతుంది అంటున్నారు. ఇక టీడీపీ – జ‌న‌సేన క‌లిసినా ఈ జిల్లాలో వైసీపీకి బ్యాండ్ ప‌డిపోద్ది. ఇవ‌న్నీ ఆలోచించే జ‌గ‌న్ కాపుల్లో మంచి ప‌ట్టుఉన్న‌ తోట త్రిమూర్తులుకు ఇక్క‌డ పెద్ద పీఠ వేస్తోన్న ప‌రిస్థితి ఉంది.