రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చేశారు..!

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యుత్తమ పురస్కారాలలో ఒకటైన రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇకపై దీనిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ ట్వీట్‌లో తెలిపారు.

మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని భారత దేశం నలుమూలల నుంచి నాకు వినతులు వస్తున్నాయి. అభిప్రాయాలను వెల్లడించినవారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఖేల్ రత్న అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తాం. జై హింద్!’’ అని తెలిపారు.

ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92లో ఏర్పాటు చేశారు. ఈ పురస్కారం క్రింద రూ.25 లక్షలు నగదు బహుమతి ఇస్తారు. మొట్టమొదట చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌కు ఇచ్చారు. లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధన్‌రాజ్ పిళ్ళై, పుల్లెల గోపీచంద్, అభినవ్ భింద్రా, అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్ కూడా ఈ పురస్కారాన్ని పొందారు.

మేజర్ ధ్యాన్ చంద్ ఫీల్డ్ హాకీ ప్లేయర్. ఆయన 1926 నుంచి 1949 వరకు అంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్నారు. తన కెరీర్‌లో 400కు పైగా గోల్స్ స్కోర్ చేశారు. 1928, 1932, 1936లలో ఒలింపిక్స్ బంగారు పతకాలను గెలుచుకున్న ఇండియన్ హాకీ టీమ్‌లో ఆయన ఉన్నారు.

క్రీడా రంగంలో జీవిత కాల సాఫల్యం సాధించినవారికి ధ్యాన్ చంద్ అవార్డును ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిని 2002లో ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని ఓ స్టేడియంకు కూడా 2002లో ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.