విశాఖ టీడీపీ ఎంపీ క్యాండెట్ భ‌ర‌త్ కాదా… !

విశాఖ టీడీపీ వచ్చే ఎన్నికల మీద దృష్టి పెడుతోంది. దాని కోసం తగిన కసరత్తు కూడా చేస్తోంది. ఆ మధ్యన టీడీపీ పార్టీ కార్యవర్గాలు ప్రకటించడం వెనక కూడా కొత్త ముఖాలను రంగంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన ఉందని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటుని ఈసారి కచ్చితంగా గెలుచుకోవాలి అని టీడీపీ పంతం పడుతోంది. 1999 తరువాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. చివరిసారిగా ఎంవీవీఎస్ మూర్తి ఆనాడు గెలిచారు. ఇక 2004, 2009ల‌లో రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. అలాగే 2014లో బీజేపీ గెలిస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ తొలిసారిగా గెలిచి జెండా ఎగరేసింది. ఈ నేపధ్యంలో టీడీపీకి విశాఖ ఎంపీ సీటు దక్కక 2024 నాటికి కచ్చితంగా పాతికేళ్ళు అవుతుంది అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య చిన్న అల్లుడు శ్రీ భ‌ర‌త్‌ను పోటీకి దింపినా కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

ఈ సారి కూడా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర‌క‌పోతే అది ఘోర అవ‌మాన‌మే అవుతుంది. అయితే ఈసారి మాత్రం టీడీపీ తన స్ట్రాటజీ మారుతోంది అంటున్నారు. అదేంటి అంటే బలమైన సామాజికవర్గాన్ని ముందు పెట్టి గెలుపు జూదం ఆడడం. విశాఖ జిల్లాలో బీసీలుగా అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజికవర్గానికి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయిపోయింది. అందుకే పల్లా శ్రీనివాస్ ని తెచ్చి విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ ని చేసింది. ఆయన గతంలో అంటే 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి రెండు లక్షల యాభైవేల‌ దాకా ఓట్లను సంపాదించారు. ఆ తరువాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి గెలిచారు.

2019 ఎన్నికలలో ఓడినా కూడా ఆయనకు గట్టి పట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌ల్లా ప‌వ‌న్‌ను వెన‌క్కు నెట్టేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఇప్పుడు విశాఖ‌లో వైసీపీ యాద‌వ వ‌ర్గాన్ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకునే ప్లాన్‌లో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతోంది. వైసీపీలో అక్క‌డ ప‌ద‌వులు అన్ని యాద‌వుల‌కే ఇస్తున్నారు. దాంతో అదే వ‌ర్గానికి చెందిన ప‌ల్లాకే విశాఖ ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకోవాలని టీడీపీ ఆలోచిస్తోందిట. టీడీపీ అనగానే కమ్మ సామాజికవర్గమే ముందుంటుంది. దానిని నిజం చేసేలా అనేక పర్యాయాలు ఎంవీవీఎస్ మూర్తికే టికెట్ ఇచ్చారు.

ఆయన మొత్తం రెండు సార్లు గెలిస్తే మరో మూడు సార్లు ఓడిపోయారు. ఇక వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారు అన్న మచ్చ కూడా టీడీపీ మీద ఉంది. దాన్ని ఈసారి తుడిచేసుకుని పల్లాకు టికెట్ ఇవ్వడం ద్వారా పాతికేళ్ళుగా దక్కని ఎంపీ సీటుని దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.