ప్రతిపక్షాల వల్ల దేశభద్రతకు ముప్పుందా ? !!

ప్రతిపక్షాల వల్ల దేశభద్రతకు ముప్పుందా ? కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన వ్యాఖ్యలతో అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. పార్లమెంటు సమావేశల్లో మంటల మండిస్తున్న పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశాన్ని చర్చించాల్సిందే అని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఇదే విషయం గడచిన 15 రోజులుగా పార్లమెంటులోని ఉభయసభలను పట్టి కుదిపేస్తోంది. ప్రతిపక్షాలు ఇంత డిమాండ్ చేస్తున్నా కేంద్రప్రభుత్వం మాత్రం చర్చకు ఇష్టపడటంలేదు.

అధికార-ప్రతిపక్షాల మధ్య మొదలైన ప్రతిష్టంభనను క్లియర్ చేయటానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చొరవచూపించారు. ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్, పియూష్ గోయెల్ తో మాట్లాడారు. ఈ నేపధ్యంలోనే పెగాసస్ పై పార్లమెంటులో చర్చకు కుదరదని తేల్చిచెప్పారు. ఎందుకంటే దేశభద్రతకు సంబంధించిన పెగాసస్ అంశాన్ని పార్లమెంటులో చర్చించేందుకు లేదని చెప్పారు. కేంద్రమంత్రుల తాజా వైఖరి చూసిన తర్వాత కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను దుర్వినియోగం చేసిందని స్పష్టమైపోయింది.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను దేశభద్రతకు విఘాతం కలిగించే సంస్ధలు, వ్యక్తులపై నిఘాకు మాత్రమే ఉపయోగించాలి. కేంద్రం ఈ అంశానికి మాత్రమే పరిమితమయ్యుంటే ఇబ్బందే ఉండేదికాదు. కానీ ప్రతిపక్ష నేతలు, శాస్త్రవేత్తలు, జడ్జీలు, న్యాయవ్యవస్ధలోని కీలక స్ధానాల్లో ఉన్నవారు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల దగ్గర పనిచేసేవారు, వారి సన్నిహితులు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సీఎంలే కాకుండా చివరకు ఇద్దరు కేంద్రమంత్రుల మొబైళ్ళను కూడా ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

కేంద్రం వైఖరి చూస్తుంటే ప్రతిపక్ష నేతలు తదితరుల వల్ల దేశభ్రదతకు ముప్పుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే కేంద్రం ఏ తప్పు చేయకపోతే పెగాసస్ పై చర్చించేందుకు వెనకాడాల్సిన అవసరమే లేదు. పెగాసస్ వినియోగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి విచారణ చేయాలని ప్రయత్నిస్తే దాన్ని కూడా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు. జరుగుతున్నది చూస్తుంటే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం కచ్చితంగా దుర్వినియోగం చేసిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తమపై వస్తున్న ఆరోపణలను తట్టుకోలేక, సమాధానాలు చెప్పే సీన్ లేకపోవటంతోనే ఏకంగా చర్చనే కేంద్రప్రభుత్వం అడ్డుకుంటోంది. చర్చకు నిరాకరించటాన్ని దేశభద్రతకు ముప్పనే ముసుగును వేస్తోంది. యూపీఏ అధికారంలో ఉన్నపుడు రక్షణరంగంలో కుంభకోణం జరిగిందని ఆరోపించింది. రక్షణరంగం విషయాలను పార్లమెంటులో చర్చించేందుకు లేదని ఆరోజు యూపీఏ ప్రభుత్వం చెప్పినా అప్పటి బీజేపీ నేతలు వినిపించుకోలేదు. అదే బీజేపీ ఇపుడు అధికారంలో ఉందికాబట్టి దేశభద్రతని సొల్లు చెబుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.