ఇదేం బాలేదు మోడీ గారు !

కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షతో వ్యవహరిస్తోందో అందరికీ అర్ధమైపోయింది. టోక్యో ఒలంపిక్స్ లో షటిల్ బాడ్మింటన్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఇండియాకు తిరిగివచ్చిన పీవీ సింధు విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. టోక్యో నుండి ఢిల్లీకి మంగళవారం చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలోనే ఘనస్వాగతం లభించింది. సరే ఈ స్వాగతాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందని అనుకుందాం. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు.

ఒక్క ఠాకూరే కాదు ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, క్రీడా శాఖ సహాయమంత్రి నిశిత్ ప్రమాణిక్ తో పాటు చాలామంది ఎంపిలు తదితరులు పాల్గొన్నారు. సింధు సాధించిన విజయం గురించి చాలా గొప్పగా ప్రశంశించారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులను లేదా పాల్గొన్న క్రీడాకారులను ప్రోత్సహించటంలో తప్పేలేదు. కానీ ఇదే విధమైన కార్యక్రమం భారత్ కు సిల్వర్ మెడల్ సాధించిన చాను సైకోం మీరాబాయ్ టోక్యో నుండి వచ్చినపుడు ఎందుకు నిర్వహించలేదు ?

సింధు తెచ్చింది బ్రాంజ్ మెడల్ మాత్రమే కానీ చాను తెచ్చింది సిల్వర్ మెడల్. టోక్యో నుండి చాను వచ్చినపుడు చాలాకొద్దిమంది వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రముఖులు మాత్రమే స్వాగతం పలికారంతే. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రుల్లో ఎవరూ పాల్గొనలేదు. సింధు అభినందన సభ జరిపినట్లే చానుకు అభినందన సభ నిర్వహించలేదు. మనదేశంలో షటిల్ కున్న పాపులారిటీ వెయిట్ లిఫ్టింగ్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాగే సెల్ఫ్ మార్కెటింగ్ లో సింధు కున్న సామర్ధ్యం చానుకు లేకపోవచ్చు. కానీ ఇక్కడ వ్యక్తిగత సామర్ధ్యంతోనో లేకపోతే స్పాన్సరింగ్ తోనే ఏమీ సంబంధంలేదు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికుంది. పైగా సింధు సాధించింది బ్రాంజ్ మెడల్ మాత్రమే అయితే చాను తెచ్చింది సిల్వర్ మెడల్ అన్నది మరచిపోకూడదు. కేంద్రం చూపిస్తున్న ఇటువంటి వివక్ష క్రీడాకారుల మానసిక పరిస్దితిపై తీవ్రంగా పడుతుందని పెద్దలు గ్రహించాలి.