పొత్తు పెటాకులు.. ఏపీలో బీజేపీ సోలో ఫైట్ ?

ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందిట. పవన్ కళ్యాణ్ పోకడలు తెలిసి అలా వ్యవహరిస్తోంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకుని యేడాదిన్న‌ర‌ గడచింది కానీ బీజేపీకి పెద్దగా లాభం ఒనకూడింది లేదు. పైగా పవన్ సినిమాలు వదలడంలేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేరు అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మనసులో టీడీపీ ఉందని కూడా అనుమానిస్తున్నారు. పవన్ సైతం తిరుపతి ఉప ఎన్నికల తరువాత బీజేపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. తన రాజకీయం ఏంటో తానేంటో అన్నట్లుగానే ఆయన వైఖరి ఉంది.

ఇక బీజేపీ ఒంటరి పోరు కోసం ఏం చేయాలో అవే చేస్తోంది అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ మతాన్ని నమ్ముకుంటోంది. అందుకే టిప్పు సుల్తాన్ వివాదాన్ని రాజేసింది అంటున్నారు. కడపకు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు వెళ్ళి మరీ హిందూత్వం మీద గట్టిగానే సౌండ్ చేశారు. అలాగే ఈ మధ్య కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ వైసీపీ ఎమ్మెల్యే అయితే గోవధ మీద హాట్ కామెంట్స్ చేశారు. దాంతో బీజేపీ ఈ అంశాన్ని ఎంచుకుంది. ఏపీలో గోవధ నిషేధం మీద చట్టం చేయాలని కోరుతోంది. అదే విధంగా ఇటీవ‌ల‌ దేవాలయాల సందర్శన కూడా చేస్తూ బీజేపీ నేతలు దేవుడినే నమ్ముకుంటున్నారు.

ఇక లేటేస్ట్ గా నీటి ప్రాజెక్టుల మీద ఆందోళన చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇలా తమ పార్టీకి ఒక అజెండా పెట్టుకుని ఒంటరిగానే పోరాడుతోంది. ఈ విషయాన్ని క్యాడర్ కి కూడా పార్టీ తనదైన సంకేతాలు ఇవ్వడం ద్వారా చెప్పేసింది అంటున్నారు. ఏపీలో ఎపుడు ఎన్నికలు వచ్చినా అన్ని చోట్ల నుంచి బీజేపీ అభ్యర్ధులు నిలబడేలా చూసుకోవాలని కూడా నాయకులకు చెబుతున్నారుట‌. నిజానికి ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ కి బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితోనే చెడింది అని బీజేపీ నేతలు అంటారు.

తమను బీజేపీ నాయకులు తగిన గౌరవం ఇవ్వడం లేదని జనసేన నాయకులు భావిస్తారు. బీజేపీ కాపు కోటాలో ప‌వ‌న్‌ను ముందు పెట్టుకుని జ‌న‌సేన‌ను అణ‌గ‌దొక్క‌తూ తాను ఎదిగే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అటు బీజేపీ కూడా ప‌వ‌న్‌ను పార్ట్ టైం పొలిటిషీయన్‌గానే చూస్తోంది. ప‌వ‌న్‌ను ఓ వైపు వాడుకుంటూనే మ‌రో వైపు ఎన్నో అవ‌మానాల‌కు గురి చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. మొత్తానికి రెండు వైపుల నుంచి కూడా ఉన్న అనుమానాలే చివరికి ఈ పొత్తు పెటాకులు అయ్యేలా చేస్తున్నాయని అంటున్నారు.