అమర్ రాజా ను మేమే పొమన్నాం

కింద పడినా పైచేయి నాదేనన్నాడంట వెనుకటి ఒకడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. రాజకీయాల్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే.. అందులో కనిపించే ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే.. ఫలానా జరిగింది కాబట్టి ఫలానా అన్నది అనుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా ఒక పరిశ్రమ ఒక ప్రాంతం నుంచి తరలి వెళితే నష్టమా? లాభమా? అన్న ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.

అమర్ రాజా బ్యాక్టరీ కంపెనీ ఎవరిదన్న సంగతి తెలిసిందే. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ పరిశ్రమ.. రాజకీయ శత్రుత్వం కారణంగా.. అధికారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని భరించలేకనే ఏపీ నుంచి తమిళనాడుకు వెళుతన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ఎపిసోడ్ ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన సజ్జల సిత్రమైన వాదనను వినిపించారు. అమర్ రాజా బాటరీ కంపెనీ వల్ల విష పదార్ధాలు వస్తున్నాయని రాష్ట్ర హైకోర్టు ధృవీకరించిందని.. అమర్ రాజా సంస్థ పోవటం కాదు ప్రభుత్వమే పొమ్మంటోందని ఆయన పేర్కొన్నారు. ‘అమరరాజా సంస్థ కాలుష్యాన్ని వెదజల్లుతోంది.. ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తోంది… అది విషతుల్యమైన పరిశ్రమ.. ఈ విషయాన్ని కోర్టు కూడా చెప్పింది. అందుకే ప్రభుత్వమే దండం పెట్టి మరీ పంపిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

చిత్తూరు జిల్లాలో ఉండే ఈ సంస్థకు డైరెక్టర్ గా గల్లా జయదేవ్ వున్నారు. బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండో అతి పెద్ద సంస్థ అమర్ రాజానే. రాజకీయాలకు అమరరాజా సంస్థతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేదన్నారు. భవిష్యత్తు మొత్తం లిథియం ఆయాన్ బ్యాటరీల హవా నడుస్తున్నందున చిత్తూరులో వాటికి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని కంపెనీ భావించింది. అయితే.. ప్రభుత్వంతో ఉన్న ఇబ్బందులతో పరిశ్రమను తమిళనాడుకు తరలించాలని సంస్థ నిర్ణయించింది.

బ్యాటరీల పరిశ్రమలో పేరున్న కంపెనీ విషయంలో సజ్జల చేసిన కామెంట్లు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. రాజకీయ శత్రుత్వం ఉంటే మాత్రం.. రాష్ట్రానికి ఉపాధి.. ఆదాయాన్ని తెచ్చి పెట్టే పరిశ్రమ బయట రాష్ట్రాలకు వెళ్లేలా చేయటం ఏమిటి? వెళుతున్న కంపెనీపై ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 15వేలమంది ఉపాధి అవకాశాల్ని పొందుతున్నారు. ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ సంస్థ కారణంగా ఏడాదికి పన్నుల రూపంలో రూ.2400 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తంలో రూ.1200 కోట్లు ఏపీ ఖజానాకు చేరుతుంటే.. మరో రూ.1200కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లనున్నాయి.

చిత్తూరు జిల్లాకు చుట్టుపక్కల ఉన్న నెల్లూరు.. కడప జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఈ సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. రాజకీయాన్ని.. వ్యాపారాన్ని వేరుగా చూడాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా రెండింటిని ఒకేలా చూడటంతో సమస్యగా మారిందంటున్నారు. సజ్జల వారు చెప్పినట్లుగా అమర్ రాజా కంపెనీ అంత దరిద్రపుగొట్టుదే అయితే..పక్కనున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ రెడ్ కార్పేట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. చేతిలో ఉన్న ముద్ద నోట్లోకి పోకుండా చేసుకోవటం అంటే ఇదేనేమో?