ప్రతిపక్షాల వ్యూహాత్మక నిర్ణయం ?

కొద్దిరోజులుగా పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు మండించిన పెగాసస్ మంటలు చల్లారిపోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది ప్రతిపక్షాల వ్యూహం చూస్తుంటే. పార్లమెంటులో పెగాసస్ సాఫ్ట్ వేర్ తో ప్రతిపక్ష్ నేతలతో పాటు ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా, గోల చేసినా ప్రధానమంత్రి నరేంద్రమోడి సమాధానం చెప్పటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు.

అందుకనే ప్రతిపక్షాలు తమ రూటు మార్చాలని డిసైడ్ చేసుకున్నాయట. సోమవారం ఇదే వషయమై సుప్రింకోర్టులో కేసు వేయాలని డిసైడ్ చేశాయట. తమ పోరాట వేదికను పార్లమెంటు నుండి సుప్రింకోర్టుకు మార్చటానికి ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇదే విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు ఇద్దరు జర్నలిస్టులు కూడా కేంద్రంపై కేసు వేసిన విషయం తెలిసిందే. వాళ్ళేసిన కేసులను ఆగస్టు మొదటివారం నుండి విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు.

ఇపుడు వాళ్ళదారిలోనే ప్రతిపక్షాల నేతలు కూడా వరుసగా సుప్రింకోర్టులో కేసులు వేయబోతున్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పకపోయినా సుప్రింకోర్టు విచారణలో అయితే కేంద్రం సమాధానం చెప్పి తీరాల్సిందే. పోరాట వేదికను సుప్రింకోర్టుకు మర్చాలని డిసైడ్ చేసిన తర్వాత ఇక ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏమి చేస్తాయి ? ఏం చేస్తాయంటే ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యాయి.

పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదల, నిత్యావసరాల ధరలు, కరోనా వైరస్ నియంత్రణలో కేంద్రం వైఫల్యాలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న శాంతి భద్రతల సమస్యల్లాంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీయటానికి ప్రతిపక్షాలు అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. సబ్జెక్టు మారినా పోరాటపంథాను మాత్రం వదిలిపెట్టేది లేదని ప్రతిపక్షాలు గట్టిగానే నిర్ణయించుకున్నాయి. మరి సమావేశాలు జరిగే మిగిలిన 11 రోజులు ఉభయసభల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.