నష్టపోయాం.. కానీ ఆస్తులమ్ముకోలేదు-ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్య వారసత్వాన్నందుకుంటూ గాయకుడిగా మంచి పేరే సంపదించాడు ఎస్పీ చరణ్. ఐతే అతను మరీ ఎక్కువ పాటలేమీ పాడలేదు. కొన్నేళ్లు పాటలు పాడాక తమిళం లో నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాడు. అతను ప్రొడ్యూస్ చేసిన చెన్నై-28, ఆరణ్య కాండం లాంటి చిత్రాలు క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. కానీ అవి విడుదలైన సమయంలో అనుకున్నంత మేర డబ్బులు మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇ

వి కాక చరణ్ నిర్మించిన వేరే చిత్రాలు అతడికి భారీగా నష్టాలు మిగిల్చాయి. దీంతో చరణ్ వల్ల బాలు కుటుంబం అప్పుల పాలైందని.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో పడిందని అప్పట్లో మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీని గురించి అప్పుడు బాలు కానీ.. చరణ్ కానీ స్పందించలేదు. ఐతే తాజాగా చరణ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమ గురించి అప్పట్లో జరిగిన ప్రచారంపై మాట్లాడాడు.

తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో నష్టాలు వచ్చిన మాట వాస్తవమే అని చరణ్ తెలిపాడు. చివరగా తాను నిర్మించిన ‘ఆరణ్య కాండం’కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయని.. న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ పురస్కారం దక్కిందని.. కానీ ఈ సినిమాకు పేరు వచ్చినంతగా డబ్బులు రాలేదని చరణ్ చెప్పాడు. అదే టైంలో రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, హ్యారిస్ జైరాజ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు తమ ఇళ్లలోనే మ్యూజిక్ స్టూడియోలు పెట్టుకోవడంతో తన తండ్రి పెట్టిన కోదండపాణి స్టూడియోస్‌‌కు ఆదాయం రావడం ఆగిపోయిందని చరణ్ తెలిపాడు. అందులో పని చేసే వారికి వేరే చోట ఉద్యోగాలు ఇప్పించి.. అందులోని పరికరాలను జెమిని స్టూడియోస్ వాళ్లుక ఇచ్చేశామని.. ఇది చూసి తాము ఆస్తులు అమ్ముకుంటున్నామని.. తన వల్ల బాలు దెబ్బ తిన్నారని మీడియాలో రాశారని చరణ్ అన్నాడు.

తాను ఆ సమయంలో గిల్టీగా ఫీలవుతుంటే.. నాన్నే తనను ఓదార్చారని.. ఎవరేమన్నా పట్టించుకోవద్దని అన్నారని చరణ్ చెప్పాడు. తర్వాత నాన్నతో కలిసి చేసిన స్టేజ్ షోలు ఆ బాధ నుంచి తనను బయటపడేశాయన్నాడు. త్వరలోనే తన తండ్రి స్థానంలో ‘పాడుతా తీయగా’ షోను నడిపించబోతున్నానని.. దీని కోసం పాత ఎపిసోడ్లు చూస్తూ ప్రిపేరవుతున్నానని చరణ్ వెల్లడించాడు.