ఏపీ థియేట‌ర్ల య‌జ‌మానులు.. ఇక‌ తాడోపేడోనే

ఈ ఏప్రిల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ రిలీజ్ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొద‌లైన టికెట్ల రేట్ల గొడ‌వ ఎంత‌కీ తెగ‌ట్లేదు. ప‌వ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డానికే చేశారో ఏమో కానీ.. ఎన్న‌డూ లేనిది ఆ సినిమాకు టికెట్ల రేట్ల విష‌యంలో నియంత్ర‌ణ తేవ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. ఎన్నో ఏళ్ల కింద‌టి టికెట్ల రేట్ల‌కు సంబంధించిన జీవోల‌ను తిర‌గ‌దోడి.. చిన్న సెంట‌ర్ల‌లో 20-30-40 రూపాయ‌ల రేట్ల‌కు టికెట్లు అమ్మాల‌న‌డం థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌తో గ‌గ్గోలు పెట్టించింది.

న‌గ‌రం.. ప‌ట్ట‌ణం.. ప‌ల్లెటూరు.. అని తేడా లేకుండా గ‌త కొన్నేళ్ల‌లో అన్ని ధ‌ర‌లూ అమాంతం పెరిగిపోగా.. థియేట‌ర్ల‌లో టికెట్ల‌ను మాత్రం ఇంత త‌క్కువ‌కు అమ్మాల‌న‌డం అన్యాయం అంటూ వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేసినా ఏపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. చిన్న సెంట‌ర్ల‌లో కూడా థియేట‌ర్ల‌లో ఏసీలు పెట్టి డిజిట‌లైజ్ చేసి సిటీ థియేట‌ర్ల‌కు దీటుగా త‌యారు చేసిన నేప‌థ్యంలో కామ‌న్ రేటు రూ.100 పెట్టాల‌ని థియేట‌ర్ల య‌జ‌మానులు ప్ర‌భుత్వానికి విన్న‌వించారు. సినీ ప‌రిశ్ర‌మ నుంచి కూడా ఈ దిశ‌గా రెప్ర‌జెంటేష‌న్ వెళ్లింది.

కానీ జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం రేట్లు మార్చ‌డానికి స‌సేమిరా అంటోంది. వ‌కీల్ సాబ్‌కు నియంత్ర‌ణ తెచ్చి.. త‌ర్వాతి చిత్రాల‌కు రేట్లు పెంచేస్తే బాగుండ‌ద‌నో ఏమో.. ప్ర‌భుత్వం ప‌ట్టు వీడ‌ట్లేదు. కానీ ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్లు తెరుచుకోగా.. ప్ర‌భుత్వం నిర్దేశించిన రేట్ల‌తో సినిమాలు ఆడించ‌డం అసాధ్యం అంటున్నారు ఎగ్జిబిట‌ర్లు. అందుకే వారం రెండు వారాలు కొత్త సినిమాల‌ను న‌డిపించి.. ఆ త‌ర్వాత థియేట‌ర్లు మూత వేసి నిర‌స‌న తెల‌పాల‌ని ఎగ్జిబిట‌ర్లు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

మున్ముందు పెద్ద సినిమాలు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఈ రేట్ల‌తో థియేట‌ర్ల‌ను న‌డిపిస్తే న‌ష్టాల పాలు కాక త‌ప్ప‌ద‌ని.. ఇప్ప‌టికే క‌రోనా ధాటికి దారుణంగా దెబ్బ తిన‌గా.. ఇప్పుడీ టికెట్ల ధ‌ర‌లను కొన‌సాగిస్తే త‌మ మ‌నుగ‌డే క‌ష్ట‌మ‌ని.. కాబ‌ట్టి త‌మ‌కు న్యాయం జ‌ర‌గాల్సిందే అని అమీతుమీ తేల్చుకోవ‌డానికి ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మ‌వ‌తున్న‌ట్లు స‌మాచారం.