తెలంగాణలోనూ కరోనా డెల్టా ప్లస్ కేసులు..!

కరోనా మహమ్మారి మన దేశంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ మధ్యకాలంలో కరోనా కేసులు కాస్త తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ పెరగడం మొదలైంది. తాజాగా.. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కాగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యంత ప్రమాదకారిగా హెచ్చరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించిన కేసులు నమోదవ్వడం గమనార్హం.

ఈ డెల్టా ప్లస్ కేసులు ఈ నెల 23 నాటికి తెలంగాణలో రెండు నమోదైన్టుల కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో డెల్టా ప్లస్ ఉనికి ఉందని స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 డెల్టా ప్లస్ కేసులు గుర్తించారు. కరోనా వైరస్ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారింది. రెండో దశలో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఆ డెల్టా రకం మరికొన్ని మార్పులలో డెల్టా ప్లస్ గా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్ లో 11, తమిళనాడులో 10 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,44,330 గా నమోదైంది. కరోనా చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3,800కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.