ఈ ఇద్దరూ జిల్లాకు చేసిందేమీ లేదా.. ?

విశాఖ జిల్లా అనంగానే ఇద్దరు మాజీ మంత్రులు గుర్తుకువస్తారు. ఇక తెలుగుదేశం ఏలుబడి కూడా సుదీర్ఘంగా సాగింది. ఏకంగా 22 ఏళ్ల పాటు టీడీపీ ఉమ్మడి ఏపీని, విభజన ఏపీని ఏలింది. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎపుడు గెలిచినా కూడా మంత్రిగానే పనిచేసేవారు. ఆయన నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ, తరువాత చంద్రబాబు జమానాలోనూ కూడా కీలకమైన శాఖలు అన్నీ కూడా చేపట్టారు. అదే విధంగా విశఖ సిటీకి చెందిన మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా దాదాపుగా ఏడేళ్ళ పాటు మంత్రి కుర్చీలో ఉన్నారు.

ఆయన మొదటిగా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగెస్ ప్రభుత్వంలో ఓడరేవులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేశారు. అక్కడ రెండేళ్ల పాటు మంత్రిగా ఉన్న గంటా 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు గెలవడంతో ఆయనకు మళ్ళీ మంత్రి యోగం పట్టింది. ఈసారి మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కీలకమైన శాఖనే తీసుకున్నారు. ఇక గంటా మంత్రిగా జిల్లాలో ఉన్నారు అన్న మాటే కానీ తన శాఖల ద్వారా జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటి అంటే చెప్పలేరు. ఆయన వరసపెట్టి గెలుస్తున్నారు, రాజకీయంగా గట్టి పట్టు సాధించారు తప్ప మంత్రిగా తాను చేసిన సేవలు ఇవి అని చెప్పుకోవడానికి ఏమీ లేదని అంటారు.

ఎక్క‌డో ప్ర‌కాశం జిల్లా నుంచి వ‌చ్చిన గంటాను స్థానిక నేత‌ల‌ను కాద‌ని మ‌రీ జిల్లా వాసులు గెలిపిస్తున్నారు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా.. నియోజ‌క‌వ‌ర్గాలు మారినా కూడా జిల్లా, న‌గ‌ర జ‌నాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ఆ స్థాయిలో మాత్రం గంటా జిల్లాలో త‌న‌దైన మార్క్ అభివృద్ధి ప‌ని ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా చేయ‌లేదు. ఇదే విధంగా అయ్యన్నపాత్రుడు తీరు కూడా ఉంది. ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగానే కాదు, పంచాయతీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మొదట్లో ఎన్టీఆర్ హయాంలో టెక్నికల్ మినిస్టర్ గా ఉన్నపుడు జిల్లాకు పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకువచ్చారు.

ఆ తరువాత ఆయన అటవీ శాఖతో పాటు, అనేక శాఖలు చేపట్టినా కూడా జిల్లాకు ప్రత్యేకించి ఒరిగింది ఏమీ లేదనే జనాలు చెబుతారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఎంతసేపూ తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచన చేస్తూ వచ్చారు తప్ప జిల్లా ప్రగతి విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని అంటారు. పైగా వీరిలో వీరికి పొస‌గ‌క‌.. రాజ‌కీయంగా శ‌త్ర‌వులుగా మారి క‌ల‌హించుకుంటూ వ‌చ్చారు. అందుకే ఈ రోజు వారిది పూర్తిగా ఉనికి పోరాటంగా మారింది అంటున్నారు. మరి వైసీపీ మంత్రులు అయినా తమదైన ముద్ర వేయకపోతే రేపటి రోజున ఇలాగే సీన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.