మురుగదాస్ కు ఊరట.. మరెందరో దర్శకులకు ఉత్సాహం

తెలుగు.. తమిళ దర్శకుల్లో భిన్నమైన రీతిలో సినిమాలు తీసే వారిలో మురుగదాస్ ఒకరు. కమర్షియల్ చిత్రంలోనూ ప్రభుత్వాలకు ఘాటైన పంచ్ లు వేసేలా చేయటంలో ఆయన తీరు మిగిలిన వారికి కాస్త భిన్నం. పాలకులు చేసే తప్పుల్ని తన సినిమాల్లోని పాత్రల చేత ప్రశ్నిస్తారు. ఇరుకున పడేలా చేస్తుంటారు. ఈ క్రమంలో అనుకోని రీతిలో ఆయనో కేసులో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. 2018లో తమిళ అగ్రహీరోల్లో ఒకరైన విజయ్ నటించిన సర్కారు చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించటం తెలిసిందే.

ఈ మూవీలో ప్రభుత్వాలు అమలు చేసే అనేక ఉచిత పథకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సినిమాతో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తన సినిమాతో తమను ఇబ్బంది పెట్టిన దర్శకుడికి చుక్కలు చూపించేందుకు వీలుగా అన్నాడీఎంకేకు చెందిన కార్యకర్త దేవరాజన్ అనే వ్యక్తి చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ చేశారు. మాంచి కాక మీద ఉన్న ప్రభుత్వం.. ఈ కంప్లైంట్ విషయంలో సీరియస్ గా రియాక్టు కావాలని భావించింది.

ముంచుకొస్తున్న ముప్పును గుర్తించిన మురుగదాస్ వెంటనే రియాక్టు అయి.. సదరు కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అదే సమయంలో.. ఈ కేసును కొట్టేయాలని విన్నవించుకుంటూ తన వాదనను వినిపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ తాజాగా జరిగింది. సెన్సార్ పూర్తి అయిన తర్వాత సినిమా విడుదలైందని.. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే సెన్సార్ సమయంలో చెప్పాలన్న పాయింట్ తో పాటు.. సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి లేదా ప్రభుత్వం కేసు పెట్టలేదని కోర్టు పేర్కొంది.

సెన్సార్ పూర్తి చేసిన తర్వాత కేసు పెట్టటమంటే.. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఉందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. మురుగదాస్ మీద పెట్టిన ఫిర్యాదును కొట్టిపారేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మురుగదాస్ రిలీఫ్ కావటమే కాదు.. భవిష్యత్తులో పాలకులకు కడుపు మండి.. కేసు చిక్కుల్లోకి ఎవరూ పడకుండా ఉండేలా కోర్టు తీర్పు పనికి వస్తుందన్న మాట వినిపిస్తోంది.