ఏపీలో బీజేపీ ఎందుకిలా చేస్తోంది?

బీజేపీ నేతల్లో కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించటమనే చిన్న విషయాన్ని పట్టుకుని బీజేపీ నేతలు అంతర్జాతీయ అంశంగా పాకులాడుతుండటమే విచిత్రంగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రొద్దుటూరులో ముస్లిం మైనారిటిల జనాభా ఎక్కువగానే ఉంది. వీళ్ళంతా పట్టణంలో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. టిప్పు అంటే మత సామరస్యానికి పెట్టింది పేరని, బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని చరిత్రలో ఉంది. కాబట్టి టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి ముస్లింలు స్పష్టం చేస్తున్నారు. అయితే సీన్లోకి హఠాత్తుగా బీజేపీ నేతలు ఎంటరైపోయారు. విగ్రహన్ని పడగొట్టాల్సిందే అని, విగ్రహావిష్కరణ జరగ్గూడదంటు వీర్రాజు, విష్ణువర్ధనరెడ్డి లాంటి కొందరు నానా రచ్చ చేస్తున్నారు.

విచిత్రమేమిటంటే టిప్పుసుల్తాన్ పరిపాలించింది ఇప్పటి కర్నాటకలోని మైసూరు సంస్ధానాన్ని. టిప్పు చేసిన వీరోచిత యుద్ధాలు, మతసామస్య పరిపాలనకు గుర్తుగా ప్రస్తుత కర్నాటక ప్రభుత్వం ప్రతి ఏడాది టిప్పు జయంతుత్సవాలను నిర్వహిస్తోంది. కర్నాటక విధానసౌధలో టిప్పు చిత్రఫొటోను స్వయంగా రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ఆవిష్కరించారు. బెంగుళూరు, మైసూరులో టిప్పు విగ్రహాలున్నాయి. కేంద్రప్రభుత్వం గెజెట్ లో కూడా టిప్పు గురించి ఎంతో గొప్పగా చెప్పింది.

కళ్ళముందే టిప్పు గొప్పతనానికి నిదర్శనాలు ఇన్ని కనబడుతుంటే, తమ పార్టీ ప్రభుత్వమే కర్నాటక, కేంద్రంలో టిప్పును గొప్పవాడని ప్రశంసిస్తుంటే ఇక్కడ వీర్రాజు అండ్ కో మాత్రం టిప్పును దేశద్రోహిగా చిత్రీకరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ముందు వీర్రాజు ఆధ్వర్యంలో పెద్ద గోల జరిగింది. అసలు ప్రజలకు పట్టని అంశాలను పట్టుకుని వీర్రాజు అండ్ కో ఎందుకింతగా గోల చేస్తోందో అర్ధం కావటంలేదు. ప్రజలకు అవసరమైన అనేక అంశాలున్నాయి. పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించటం, ఆసుపత్రులు ఏర్పాటు చేయించటం, కోవిడ్ టీకాలు తెప్పించటం లాంటి అనేక అంశాలున్నాయి.

ఇదే సందర్భంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకించటం, పోలవరం నిధులను తెప్పించటం లాంటి రాష్ట్రప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన పార్టీ నోరిప్పటంలేదు. ప్రజలకు అవసరమైన విషయాలపై నోరిప్పని నేతలు, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంలో మాత్రం ముందుంటున్నారు. ఇలాంటి చేష్టల వల్లే జనాలకు బీజేపీ దూరమైపోతోందనే విషయాన్ని కమలనాదులు గ్రహించటంలేదు. కేవలం మతపరమైన రాజకీయాలు చేయటం ద్వారా మాత్రమే జానదరణ పొందాలని చూస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా ?