కేసీఆర్ వి అన్నీ పెగ్గు పథకాలే.. బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించాడు. హుజురాబాద్ లో బీజేపీదే గెలుప‌ని, మొన్న‌టి వ‌ర‌కు ఈట‌లకు 50శాతం ఓట్లు ప‌డ్తాయ‌ని స‌ర్వేలు చెప్ప‌గా ఇప్పుడు 71శాతంకు పెరిగింద‌న్నారు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్. ఆ నివేదిక‌ల‌తోనే కేసీఆర్ దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌న్నారు. అందుకే దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరతీసిండ‌ని, కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేన‌ని విమ‌ర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఇంటింటికీ 10 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడ‌ని, చివరకు నా లెటర్ ఫోర్జరీ చేసి డబ్బు పంపిణీ ఆపి ఎన్నికలయ్యాక అందరికీ డబ్బులిస్తానని చెప్పి మోసం చేసిండని సంజ‌య్ ఆరోపించారు. హుజురాబాద్ లో ఈట‌ల చేస్తున్న పాద‌యాత్ర‌కు బండి సంజ‌య్ సంఘీభావం ప్ర‌క‌టించారు.

‘కేసీఆర్ 90 ఎంఎల్ సీఎం. ఒక్క పెగ్గు వేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటడు. రెండు పెగ్గులు వేస్తే అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లిస్తానంటడు. మూడు పెగ్గులు వేస్తే దళితులకు మూడెకరాలు ఇస్తానంటడు. నాలుగో పెగ్గు వేసి కేటీఆర్ సీఎంను చేస్తానంటడు, ఐదో పెగ్గు పంచభూతాలను నేనే అంటడు. ఏడో పెగ్గు వేశాక అసలు నేనేమీ అనలేదని బుకాయిస్తడు. ఇదీ 90 ఎంఎల్ చరిత్ర అని బండి సంజ‌య్ అన్నారు. ఈటల రాజేందర్ ను చూస్తే నా కంట కన్నీల్లొస్తున్నయ్. చాలా కష్టపడుతుండు. కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదరకుండా తిరగుతుండు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిండు. హుజూరాబాద్ ఉద్యమ గడ్డ. ఈటల ఆధ్వర్యంలో కాషాయ జెండాను ఎగరేయండి. భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ అహంకారాన్ని దింపాలని’ సంజ‌య్ పిలుపునిచ్చారు.

హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్ మళ్లీ ‘దళిత బంధు’ అంటున్నాడ‌ని, ఈ పథకం ద్వారా ఇంటికో రూ.10 లక్షలిస్తామ‌న్న మాటల‌న్ని క‌ట్టుక‌థ‌లేన‌న్నారు. పథకం స్టార్ట్ చేసి 10 మందికో 100 వంద మందికో మాత్రమే ఇస్తాడు. తరువాత కోర్టులో పిటిషన్ వేయించి ఆపేస్తాడు. బీజేపీవల్లే, ఈటల రాజేందర్ వల్లే పథకం ఆగిపోయిందని మళ్లీ అబద్దపు ప్రచారం చేయిస్తాడ‌ని, కేసీఆర్ అబద్దాలను చూసి ఛీ…థూ..అంటూ జ‌నం అసహ్యించుకుంటున్నార‌ని సంజ‌య్ మండిప‌డ్డారు.

దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆర్. పాస్ పోర్టు బ్రోకర్. వేల కోట్ల రూపాయలు దండుకుని దుబాయ్, మస్కట్, అమెరికా, లండన్ వెళ్లి డబ్బులు దాచుకుని పెట్టుబడి పెడుతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక అవన్నీ వెలికితీస్తం. ఆ డబ్బులన్నీ పేదల అకౌంట్లో వేస్తం. కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం. ఎవరో అడిగారని కాదు…సమయం చూసి జైలుకు పంపడం ఖాయం అంటూ బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.