తెలుగు సీఎంల ఫోన్లు ట్యాపింగ్ చేశారా?!!

దేశంలోని అత్యంత ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రప్రభుత్వం తెలుగు సీఎంల ఫోన్లను హ్యాకింగ్ చేయించకుండా ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సంఘ విద్రోహుల కదలికలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటం కొత్తేమీకాదు. పార్టీ అధికారంలో ఉన్నా చేసేదిదే. కాకపోతే ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

అయితే ఈ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఫెయిలయ్యింది. దేశంలోని ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కార్పొరేట్ కంపెనీల ఛైర్మన్లతో పాటు అనేకమంది ఫోన్లను కేంద్రం ట్యాప్ చేయిస్తోందనే వార్తలు దేశంలో ఇఫుడు సంచలనంగా మారింది. ఇదే విషయమై గడచిన నాలుగు రోజులుగా పార్లమెంటు అట్టుడికిపోతోంది. పార్లమెంటు లోపల, బయట ఇంత గోల జరుగుతున్న నరేంద్రమోడి మాత్రం నోరిప్పి ఏమీ మాట్లాడటంలేదు.

మోడి వైఖరితోనే ట్యాపింగ్ నిజమే అని జనాలు అనుకునేందుకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. మీడియాలో కథనాల ప్రకారం సుమారు లక్షమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయట. ఇప్పటికి బయటపడిన పేర్లు 400 అయినా ఇంకా కొన్ని వేలమంది ట్యాపింగ్ బాధితులున్నట్లు ది వైర్ మీడియా వరసు కథనాలను ప్రచురిస్తోంది. రోజు రోజుకు బాధితుల పేర్లు బయటకువస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే తెలుగు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు చంద్రబాబునాయుడు ఫోన్ కూడా హ్యాకింగ్ అయ్యేఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకసారి ట్యాపింగ్ చేయించటం మొదలుపెడితే మిత్రులు లేరు ప్రత్యర్ధులూ ఉండరు. ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్న కారణంగానే ఎప్పటికిప్పుడు మోడి ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకుంటున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి తాజా పెగాసస్ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.