టాలీవుడ్-అమేజాన్ ప్రైమ్.. అచ్చి రావట్లా


నెట్ ఫ్లిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద స్ట్రీమింగ్ జెయింట్ అంటే అమేజాన్ ప్రైమ్‌యే. ప్రపంచ స్థాయిలో నెట్ ఫ్లిక్స్‌దే ఆధిపత్యం కావచ్చు కానీ.. ఇండియాలో దాన్ని మించి అత్యధిక మూవీ, వెబ్ సిరీస్ కంటెంట్‌తో భారీగా సబ్‌స్క్రైబర్లను పెంచుకున్న ఘనత అమేజాన్ ప్రైమ్‌దే. మన వాళ్లు ఓటీటీలకు అలవాటు పడిందే ప్రైమ్‌తో. కొత్త సినిమాలు విడుదలైన నెలా నెలన్నరకే మంచి రేటు ఇచ్చి వాటిని కొనేసి డిజిటల్లో రిలీజ్ చేయడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

కొత్త సినిమాలు విడుదల కాగానే.. కొన్ని రోజులాగితే ప్రైమ్‌లో వచ్చేస్తుందిగా అని ఓ వర్గం ప్రేక్షకులు ప్రిపేరై థియేటర్లకు వెళ్లడం తగ్గించేసే పరిస్థితి గత కొన్నేళ్లలో తయారైంది. ఇక కరోనా పుణ్యమా అని కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. అందులో ఎక్కువ శాతం ప్రైమ్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దానికి ఆదరణ ఇంకా పెరిగింది.

ఐతే తెలుగు చిత్రాలపై మరే ఓటీటీకి సాధ్యపడని విధంగా భారీ పెట్టుబడులైతే పెడుతోంది కానీ.. అమేజాన్‌కు పెద్దగా కలిసొస్తున్నదేమీ లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు భారీ రేటు ఇచ్చి కొంటున్న ఆ సంస్థకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత ఏడాది నాని సినిమా ‘వి’, అనుష్క చిత్రం ‘నిశ్శబ్దం’ల మీద భారీ పెట్టుబడులే పెట్టింది అమేజాన్ ప్రైమ్. కానీ ఈ రెండూ హైప్‌ను అందుకోలేకపోయాయి. ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. ఓటీటీ సినిమా కాబట్టి ఒకసారి చూస్తే పాయె అన్నట్లు వీటిని చూశారు కానీ.. ఆశించిన స్పందన అయితే లేదు.

ఇక తాజాగా ‘నారప్ప’ లాంటి మరో పెద్ద సినిమాను ప్రైమ్ రిలీజ్ చేసింది. ఇది కూడా పై రెండు చిత్రాల జాబితాలోనే చేరింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ప్రేక్షకుల నుంచి సంతృప్తికరమైన ఫీడ్ బ్యాక్ అయితే లేదు. వెంకీ సినిమా కాబట్టి వ్యూస్ బాగానే ఉండొచ్చు. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వచ్చే స్పందనే వేరుగా ఉంటుంది. ఐతే పెద్ద సినిమాలకు ప్రైమ్‌ను నిరాశకు గురి చేస్తే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిన్న చిత్రం మాత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కాబట్టి ఇకపై పెద్ద సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టేముందు ప్రైమ్ వాళ్లు ఆచితూచి వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు.