పార్టీలకు సుప్రింకోర్టు షాక్ ?

రాజకీయ పార్టీలకు సుప్రింకోర్టు షాక్ తప్పేట్లు లేదు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధుల నేరచరిత్రను వెల్లడించని పార్టీలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో సుప్రింకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దీనిపై తీర్పును రిజర్వులో ఉంచింది. రిజర్వులో ఉంచిన తీర్పులో ఏముందో తెలీక పార్టీల్లో టెన్షన్ మొదలైపోయింది. ఎన్నికల కమీషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన లాయర్ తో పాటు రాజకీయపార్టీల తరుపున మరికొందరు సీనియర్ లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు.

మెజారిటి లాయర్లు వినిపించిన వాదనల ప్రకారమైతే అభ్యర్ధుల నేరచరిత్రను వెల్లడించని పార్టీల గుర్తింపును రద్దు చేయటమో లేకపోతే పార్టీల ఎన్నికల గుర్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలంటు బలంగా వాదించారు. అంటే ఎవరే విధంగా వాదించినా నేరచరిత్రను వెల్లడించన పార్టీలపై చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నట్లు అర్ధమైంది.

అందరి వాదనలను విన్న న్యాయమూర్తులు కూడా లాయర్ల వాదనతో ఏకీభవించారు. పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఉందన్న లాయర్ల వాదనతో జడ్జీలు సానుకూలంగా స్పందించారు. దాంతో తీర్పును రిజర్వులో ఉంచారు. ఈ సమస్యంతా ఎందుకొచ్చిందంటే బీహార్ ఎన్నికల్లో అభ్యర్ధుల నేరచరిత్రను పార్టీలు వెల్లడించలేదట. ఇదే విషయమై సీపీఎం, ఎన్సీపీ తరపున లాయర్లు క్షమాపణ చెప్పినా కోర్టు అంగీకరించలేదు.

అంతా బాగానే ఉందికానీ అందరిలోను ఓ సందేహం మొదలైంది. అదేమిటంటే అభ్యర్ధులు అఫిడవిట్లు దాఖలు చేసేటపుడే తమపై ఉన్న కేసుల వివరాలను చెబుతున్నారు. అలా చెప్పని అభ్యర్ధుల నామినేషన్లను చెల్లకుండా చేయచ్చు. ప్రాధమికదశలో అంటే నామినేషన్ దశలోనే స్ట్రిక్టుగా రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తే ప్రతి అభ్యర్ధి తనపై ఉన్న కేసులను వెల్లడిస్తారనటంలో సందేహంలేదు. దాన్ని వదిలేసి ఏకంగా పార్టీలపైన చర్యలు తీసుకోవాలనటంలో ఏమిటర్ధం ?