ఆట ఇపుడే మొదలైందా ?

Navjot Singh Sidhu

క్రికెటర్ కమ్ సీనియర్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ఇష్టంలేకుండా జరిగిన నియామకం ఇది. అమరీందర్ తో పాటు చాలామంది ఎంపిలు, ఆయన మద్దతుదారులు వ్యతిరేకించినా సిద్దూకి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించటంతోనే పంజాబ్ లో అసలైన ఆట మొదలైనట్లయ్యింది. నిజానికి ఏ పార్టీలో అయిన కీలకమైన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి లాంటి పదవుల్లో నియామకాలు చేసేటపుడు ఏకాభిప్రాయం ఏ రాష్ట్రంలో కూడా సాధ్యంకాదు.

అందుకనే మెజారిటి మద్దతుదారులు ఎవరినైతే ఆఫ్ట్ చేస్తున్నారో వారికే అధిష్టానం పదవులను అప్పగిస్తోంది. అయితే ఒక్కోసారి మెజారిటి మద్దతిచ్చే వాళ్ళనే కాదు వ్యతిరేకించే వారిని కూడా అధిష్టానం ఎంపికచేసిన సందర్భాలున్నాయి. ఇపుడు సిద్ధూ నియామకం జరిగిందిలాగే. అదికూడా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సిద్ధూ నియామకం కారణంగా రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం సస్పెన్సుగా మారిపోయింది.

చాలాకాలంగా అమరీందర్-సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి. ఇద్దరిమధ్య ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం సాధ్యం కావటంలేదు. దీంతో గడచిన రెండేళ్ళుగా రెండు వర్గాల మధ్య అభిప్రాయబేధాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఇద్దరి మద్దతుదారులు పంజాబ్ లోనే కాకుండా ఢిల్లీ వీధుల్లో కూడా చాలాసార్లు గొడవలుపడ్డారు. సరే చరిత్ర ఇపుడు అవసరం లేదనుకుంటే మరి రేపటి నుండి జరగబోయేదేమిటి ? అసలు సిద్ధూని అమరీందర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ?

ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే రేపటి ఎన్నికల్లో తన వర్గం వారికి టికెట్లలో సిద్దూ ఎక్కడ కోత కోసేస్తారో అన్న టెన్షనే అమరీందర్ లో ఎక్కువగా కనబడుతోంది. తన వర్గం ఎంఎల్ఏలకు, మద్దతుదారులకు వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్లు ఇప్పించుకోవాలని అమరీందర్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అమరీందర్ కే కాకుండా మంత్రులు, మద్దతుదారుల్లో కొందరిని సిద్ధూ మొదటినుండి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలు సిద్ధూ చేతికే దక్కటంతో టికెట్ల విషయంలో ఎక్కడ కోత పెడతాడో అన్న భయం అమరీందర్+మంత్రులు+మద్దతుదారుల్లో పెరిగిపోతోంది. అందుకనే సిద్ధూని వ్యతిరేకించేవాళ్ళని, తన మద్దతుదారులందరినీ అధిష్టానం ముందు మోహరించారు అమరీందర్. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరీందర్ సక్సెస్ కాలేదు. ఎంతమంది ఎంతగా వ్యతిరేకించినా అధిష్టానం మాత్రం సిద్ధూనే పీసీసీ అధ్యక్షునిగా ప్రకటించేసింది.

ఇకిపుడు టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ఆశావహుల జాబితాను వడబోయటంలోనే సమస్యలు మొదలవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తన వర్గంలో టికెట్లు ఎక్కడ ఎవరికివ్వాలనే జాబితాలను అమరీందర్ అధిష్టానంకు అందచేశారని సమాచారం. మామూలుగా అయితే సిద్ధూ అంటే పీసీసీ అధ్యక్షుడి ద్వారానే అధిష్టానం ఆమోదం కోసం ఢిల్లీకి జాబితా వెళ్ళాలి.

కానీ అమరీందర్ ఇప్పటికే ఓ జాబితాను డైరెక్టుగా ఢిల్లీకి అందించేశారని ప్రచారం జరుగుతోంది. మరి ఆ జాబితాను సిద్ధూ ఏమి గౌరవిస్తారా ? లేకపోతే తనదైన పద్దతిలో మరో జాబితాను తయారుచేసి అధిష్టానం ముందు పెడతారా ? అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా క్రికెటర్ గా బాగా పాపులరైన సిద్ధూ కొత్త ఇన్నింగ్స్ లో ఎలా ఆడుతాడో చూడాల్సిందే.