విమ‌ర్శ‌ల‌కు సురేష్ బాబు స‌మాధానమిది

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు మీద తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిట‌ర్లు గుర్రుగా ఉన్నారిప్పుడు. ఆయ‌న నిర్మాణంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన నార‌ప్ప చిత్రాన్ని నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తుండ‌ట‌మే అందుక్కార‌ణం. క‌రోనా దెబ్బ‌కు ఓవైపు థియేట‌ర్ ఇండ‌స్ట్రీ నాశ‌న‌మైపోతుంటే.. మంచి క్రేజున్న సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండ‌టం వారికి మింగుడుప‌డ‌టం లేదు. స్టార్లు న‌టించిన పెద్ద సినిమాల‌ను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తే మున్ముందు థియేట‌ర్ల‌కు ఎవ‌రు వ‌స్తార‌న్న‌ది వారి ప్ర‌శ్న‌. ఐతే కోట్లు పెట్టి సినిమా తీసిన త‌మ‌కు ఏది ప్ర‌యోజ‌న‌క‌ర‌మో దాన్నే ఎంచుకుంటామ‌న్న‌ది నిర్మాత‌ల వాద‌న‌.

మ‌రి సురేష్ బాబు ఈ విష‌యంలో ఏమంటారా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. దీనికి ఆయ‌న స‌హేతుక‌మైన స‌మాధాన‌మే చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల ఆలోచ‌న విధానంలో చాలా మార్పు వ‌చ్చింద‌ని.. థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూడ‌టానికి సంకోచంతో ఉన్నార‌ని సురేష్ బాబు అన్నారు. కొవిడ్ ప్ర‌భావం ప‌డ్డ కుటుంబాల ఆలోచ‌న తీరు ఒక‌లా ఉంటే.. రాని వారి తీరు మ‌రోలా ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌నం మ‌న కుటుంబ స‌భ్యుల‌ను థియేట‌ర్ల‌కు పంపించ‌న‌పుడు.. మా సినిమాకు రండి అంటూ ఇత‌ర కుటుంబాల‌ను ఎలా పిలుస్తాం అని సురేష్ బాబు ప్ర‌శ్నించారు.

నార‌ప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు వెంకీ అభిమానులే కాదు.. తాను, వెంకీ, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ కూడా బాధ‌ప‌డుతున్నామ‌ని.. ఎంతో ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించి ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామ‌ని ఆయ‌న‌న్నారు. పూర్తిగా త‌నే నిర్మించిన చిత్ర‌మైతే నార‌ప్ప‌ను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి ఒప్పుకుని ఉండేవాడిని కాద‌ని.. త‌మిళ నిర్మాత థాను కూడా భాగ‌స్వామి కావ‌డంతో ఆయ‌న‌కు క‌ర్ణ‌న్ తెచ్చిన న‌ష్టాన్ని దృష్టిలో ఉంచుకుని నార‌ప్ప‌ను ఓటీటీలో రిలీజ్ చేద్దామ‌ని అన‌డంతో స‌రే అన‌క త‌ప్ప‌లేద‌ని.. ఒకవేళ తాను ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేసి ఉంటే.. డిస్ట్రిబ్యూష‌న్ క‌మిష‌న్ కోసం అలా రిలీజ్ చేశార‌నే మాట‌లు కూడా వినిపించేవ‌ని సురేష్ బాబు పేర్కొన్నారు.