జ‌ర్న‌లిస్టులు, సుప్రీం కోర్టు జ‌డ్జిలే ల‌క్ష్యంగా ఫోన్ల ట్యాపింగ్‌

'పెగాస‌స్‌' ఫోన్ ట్యాపింగ్‌.. కీల‌క నేత‌లే టార్గెట్‌!
కేంద్ర‌ మంత్రులు, విప‌క్ష నేత‌లు, ఆర్ ఎస్ ఎస్ నాయ‌కులు
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌.. పెగాస‌స్‌
తొలుత వెలుగులోకి తెచ్చిన వాట్సాప్‌
తాజాగా వాషింగ్ట‌న్ పోస్ట్‌, గార్డియ‌న్‌ల క‌థ‌నాలు
సుబ్ర‌మ‌ణ్య స్వామి స‌హా కీల‌క‌ నేతల ఆందోళ‌న‌

దేశంలోని కీల‌క నేత‌ల ఫోన్లు ట్యాపింగ్‌కు గుర‌వుతున్నాయా? ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ ‘పెగాస‌స్‌’ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తోందా? ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త‌న‌ కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు, విప‌క్ష నాయ‌కులు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు, ఆర్ ఎస్ ఎస్ నేత‌లు, జ‌ర్న‌లిస్టులు, ప్ర‌భుత్వ ముఖ్య అధికారులు, దౌత్యాధికారుల‌ పోన్లు.. కొన్నాళ్లుగా ట్యాప్ అవుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటోంది విదేశీ మీడియా. 2019లోనే వెలుగు చూసిన ఈ వివాదం.. ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది.

దీనికి సంబంధించి బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు.. సుబ్ర‌మ‌ణ్య స్వామి తాజాగా చేసిన ట్వీట్‌.. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోం ది. ”వాషింగ్ట‌న్ పోస్ట్‌, లండ‌న్‌కు చెందిన గార్డియ‌న్ ప‌త్రిక‌లు.. ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ప్ర‌చురించాయి. పెగాస‌స్ ద్వారా కొంద‌రు కేంద్ర మంత్రులు, ఆర్ ఎస్ ఎస్ నేత‌లు, సుప్రీం న్యాయ‌మూర్తులు, జ‌ర్న‌లిస్టుల ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాస్త‌వాల‌ను నిర్ధారించుకున్న త‌ర్వాత‌.. ఎవ‌రెవ‌రి ఫోన్లు ట్యాప్ అయ్యాయో.. జాబితా వెల్ల‌డిస్తా” అని ట్వీట్ చేశారు.

ఇక‌, ఇదే అంశంపై తృణ‌మూల్ కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు డెరిక్ ఓబ్రియెన్ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసేందుకే పెగాస‌స్‌ను వినియోగిస్తున్నార‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అదేవిధంగా కార్తీ చిదంబ‌రం కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పెగాస‌స్ ద్వారా దేశంలో క‌ల్లోలం సృష్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌ముఖ జర్న‌లిస్టు షీలా భ‌ట్… ”ఇదో పెద్ద క‌థ‌” అని శ‌నివారం రాత్రి ట్వీట్ చేశారు. పెగాస‌స్‌లో భార‌త్ స‌హా మీడియా సంస్థ‌ల పాత్ర కూడా ఉంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌ముఖ ప‌త్రిక‌ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ”దాదాపు రెండు డ‌జ‌న్ల సంస్థ‌లు, లాయ‌ర్లు, ద‌ళిత ఉద్య‌మ కారులు, జ‌ర్న‌లిస్టుల ఫోన్ల‌ను పెగాస‌స్ ట్యాప్ చేసింది” అని పేర్కొంది. అయితే.. ఈ వాద‌న ఇప్ప‌టికిప్పుడు వెలుగు చూసింది కాదు. దాదాపు 2019లోనే పెగాస‌స్ గురించి పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. వాట్సాప్ సంస్థ‌.. తొలుత ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 1400 మంది ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు వివ‌రించింది.

ఇదే అంశంపై అప్ప‌టికి స‌మాచార‌, ప్ర‌సారాల శాఖ మంత్రి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్‌.. పార్ల‌మెంటులో మాట్లాడుతూ.. ”హేతుబ‌ద్ధ‌త‌లేని” వ‌దంతులుగా ఆయ‌న కొట్టిపారేశారు. కేంద్రం ఇలాంటి ప‌నులు చేయ‌ద‌ని నొక్కి చెప్పారు. అయితే.. మ‌ళ్లీ 18 నెల‌ల త‌ర్వాత‌.. పెగాస‌స్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చి సంచ‌ల‌నం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎంత డేంజ‌ర్ అంటే..

పెగాసస్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్‌. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్‌ ఫోన్‌ పూర్తిగా ఎటాకర్ అధీనంలోకి వెళ్లిపోతుంది. యూజర్‌కు తెలీకుండానే ఆ టూల్ అతడి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒకసారి ఇన్‌స్టాల్ అయ్యాక ఫోన్‌కు సంబంధించిన డేటానంతా ఎటాకర్‌కు పంపించడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత డేటాతో పాటు పాస్‌వర్డ్స్, కాంటాక్ట్‌ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్‌, ఈమెయిల్స్‌తో పాటు లైవ్ వాయిస్ కాల్స్‌ను కూడా ఇది ట్రాక్ చేయగలదు.

ఆఖరికి యూజర్‌కు తెలీకుండా అతడి ఫోన్‌ కెమెరాను, మైక్రోఫోన్‌ను కూడా ఎటాకర్ ఆన్ చేయగలడు. ఈ పెగాసస్ టూల్ లేటెస్ట్ వెర్షన్‌లో యూజర్ అసలు ఎలాంటి లింక్‌పైన క్లిక్ చేయకపోయినా సరే, కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్‌ను హ్యాక్ చేయొచ్చని వాట్సాప్ ఆరోపిస్తోంది.

ఎవ‌రెవ‌రు టార్గెట్‌?
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో 20 దేశాల్లో దాదాపు 1400 మందిపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారని వాట్సాప్ చెబుతోంది. ఈ విషయంలో ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై వాట్సాప్‌ శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసింది. 2016లో యూఏఈలో అహ్మద్ మన్సూర్ అనే సామాజిక కార్యకర్త తన ఫోన్‌ను పెగాసస్‌ సాయంతో హ్యక్ చేశారని ఫిర్యాదు చేశారు. గ‌తేడాది డిసెంబర్‌లో మాంట్రియల్‌లో ఉంటున్న సౌదీ ఉద్యమకారుడు ఒమర్ అబ్దుల్ అజీజ్ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై ఫిర్యాదు చేశారు. పెగాసస్ సాయంతో తన ఫోన్‌ను హ్యాక్ చేసి, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన పాత్రికేయుడు జమాల్ ఖాషోగ్జీతో సంభాషణలపై నిఘా పెట్టారని ఆయన కేసు వేశారు. భారత్‌లో పెగాసస్ సాయంతో తమపై నిఘా పెట్టారని ఆరోపిస్తున్న వారిలో ఆనంద్ తెల్తుంబ్డే, బేలా భాటియా, నిహాల్ సింగ్ రాథోడ్, సిద్ధాంత్ సిబల్ లాంటి పాత్రికేయులు, ఉద్యమకారులు ఉన్నారు. భీమా- కోరెగావ్ హింస కేసులో ఆనంద్‌ తెల్తుంబ్డేపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ప్రభుత్వమే తనపై నిఘా పెట్టింని ఆనంద్ ఆరోపిస్తున్నారు.