వెంకీ-తరుణ్.. ఒక ఎడతెగని కథ

Venkatesh

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’ ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఆ చిత్రంతో తన పై భారీగా అంచనాలు పెంచేసిన తరుణ్.. ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి.

ఇండస్ట్రీలో బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకుంటే.. ఈ ఐదేళ్లలో కేవలం ఒక్క సినిమా మాత్రమే తీశాడు. తన రెండో చిత్రం ‘నగరానికి ఏమైంది’ కూడా అంచనాలకు తగ్గట్లు లేదు. ఓ వర్గానికి బాగానే నచ్చినా అందరి ఆమోదం పొందలేకపోయింది. ఈ సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా తరుణ్ ఇంకో సినిమాను మొదలుపెట్టలేదు.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయడానికి తరుణ్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు కానీ.. అది ఎంతకీ కార్యరూపం దాల్చట్లేదు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అగ్ర నిర్మాత సురేష్ బాబు కూడా రెడీగా ఉన్నాడు. కానీ స్క్రిప్టు సంగతే ఎంతకీ తెగట్లేదు.

గుర్రపు స్వారీల నేపథ్యంలో వెంకీ హీరోగా తరుణ్ సినిమా చేయాలనుకుంటున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ కథ ఎంతకీ ఎందుకు కొలిక్కి రావట్లేదో అర్థం కావట్లేదు. వెంకీ స్థాయి హీరోతో సినిమా అంటే దాని మీదే ఫోకస్ పెట్టి కథలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దాలి. హీరో, నిర్మాతలను మెప్పించేలా స్క్రిప్టు రెడీ చేయాలి. కానీ ఏళ్లకు ఏళ్లు ఈ స్క్రిప్టు సంగతి ఒక కొలిక్కి రాకపోవడమేంటో అర్థం కావడం లేదు.

డైరెక్షన్ మీద ఆసక్తి తగ్గిపోయిందా అన్నట్లుగా తరుణ్ చూస్తే నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. టీవీ షో హోస్ట్ చేస్తున్నాడు. ‘నారప్ప’ ప్రమోషన్లకు వచ్చిన వెంకీ.. తరుణ్ సినిమా గురించి అడిగితే.. అతనేదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఏదో రాస్తున్నాడు. అది ఒక కొలిక్కి రానివ్వండి అన్నట్లుగా మాట్లాడాడు.

దీన్ని బట్టి స్క్రిప్టు విషయంలో వెంకీ సంతృప్తికరంగా లేడని అర్థమవుతోంది. తరుణ్‌ను ఇంతకుముందు ఈ సినిమా గురించి అడిగితే.. క్లైమాక్స్ అనుకున్నంత బాగా రాలేదని, దాని మీద వర్క్ చేస్తున్నామని చెప్పాడు. మరి ఇంకెప్పటికి స్క్రిప్టు సంగతి కొలిక్కి వచ్చి ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుందో చూడాలి.