తెలంగాణలో థియేటర్ల రీఓపెన్.. మళ్లీ ట్విస్టు


తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభం.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతి.. రేపట్నుంచే తెరుచుకోనున్న వెండితెరలు.. శనివారం సాయంత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తిపోయిన వార్తలివి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పున:ప్రారంభం కానున్న తొలి రాష్ట్రం తెలంగాణే అంటూ నేషనల్ మీడియాలో కూడా వార్తలొచ్చేశాయి.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పోస్టులు కూడా పెట్టేశారు. కానీ తీరా చూస్తే తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు మీడియాకు లేటుగా అసలు విషయం చెప్పారు. తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం ఏమీ జరగలేదని వాళ్లు తేల్చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను తాము కలిసి థియేటర్లు, సినీ పరిశ్రమలోని ఇతర సమస్యల గురించి విన్నవించామని, ఆయన సానుకూలంగా స్పందించారని.. ఐతే ఇప్పటి వరకు తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ రాలేదని.. రేపట్నుంచి థియేటర్ల పున:ప్రారంభం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మీడియాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున మెసేజ్ రావడం గమనార్హం.

మంత్రిని ఫిలిం ఛాంబర్ పెద్దలు కలిసిన కాసేపటికే ఇండస్ట్రీ నుంచే ఎవరో థియేటర్ల పున:ప్రారంభం గురించి మీడియాకు చెప్పడం.. ఆ సమాచారాన్ని అందరూ షేర్ చేయడంతో అది వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. ఐతే కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలు తమ విన్నపాలకు ఆమోదం లభిస్తే తప్ప థియేటర్ ఇండస్ట్రీ కోలుకోవడం కష్టమని.. ఆ మేరకు హామీలు వచ్చాకే థియేటర్లు ఓపెన్ చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుదలతో ఉన్నారు. ఇదేమీ తేలకుండానే థియేటర్ల పున:ప్రారంభం అని ప్రచారం సాగుతుండటంతో ఫిలిం ఛాంబర్ పెద్దలు ఈ వార్తను ఖండిస్తూ మీడియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.