టాలీవుడ్ స్టార్స్.. ఇది కరెక్టేనా?

ఒక స్టార్ హీరో సినిమా థియేటర్లలో కాకుండా టీవీల ద్వారా నేరుగా రిలీజవుతుందని కొన్నేళ్ల ముందు కూడా ఎవరూ ఊహించలేదు. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఊహించని పరిస్థితులు వచ్చాయి. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, సూర్య, నాని, అనుష్క లాంటి స్టార్ల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కావడం గత ఏడాది కాలంలో చూశాం. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ ఒరవడి కొనసాగుతోంది.

విక్టరీ వెంకటేష్ చిత్రం ‘నారప్ప’ ఇంకో ఐదు రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంత పెద్ద సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం చాలామందికి రుచించడం లేదు. ముఖ్యంగా వెంకీ అభిమానులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ చాన్నాళ్ల ముందే డీల్ అయిపోవడం, మంచి రేటు కూడా రావడంతో నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గాలనుకోలేదు.

ఐతే సురేష్ బాబు అండ్ కో తమ నిర్ణయానికి కట్టుబడటం బాగానే ఉంది కానీ.. ఈ చిత్రానికి ప్రమోషన్లే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో బయట పెద్ద పెద్ద ఈవెంట్లు చేయాలని ఎవరూ ఆశించడం లేదు కానీ.. కనీసం హీరోనో, ఇతర ముఖ్య తారలో ఒక ప్రెస్ మీట్ పెట్టడమో.. ఇంకేవైనా చిన్న ఈవెంట్లు చేయడమో చేయాలి. కనీసం ఆన్ లైన్లో సైతం ఈ సినిమాకు ప్రమోషన్లు లేవు. ఓటీటీ రిలీజ్ గురించి వెంకీ ఒక ట్వీట్ వేసి ఊరుకున్నాడు. చిత్ర బృందంలోని మిగతా వాళ్లు కూడా అంతే. మొక్కుబడిగా ఒకట్రెండు పాటలను వదులుతున్నారు. అవేమీ పెద్దగా జనాలకు చేరుతున్నట్లు లేవు.

‘నారప్ప’ అనే కాదు.. గత ఏడాది కాలంలో ఓటీటీలో రిలీజైన చాలా సినిమాలకు ప్రమోషన్లు పెద్దగా లేవు. రిలీజ్ గురించి సమాచారం ఇవ్వడం, చడీచప్పుడు లేకుండా సినిమాను రిలీజ్ చేసేయడం.. అంతటితో మమ అనిపిస్తున్నారు. థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రమోషన్ ఏ రేంజిలో చేస్తారో అందరికీ తెలిసిందే. ఓటీటీలు అంతంత రేటు పెడుతున్నపుడు వాటి కోసం ఎంతో కొంత సినిమాను ప్రమోట్ చేయకపోతే ఎలా.. సినిమాను అమ్మేయగానే తమ పనైపోయిందని చేతులు దులిపేసుకోవడం సమంజసమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఓటీటీల నుంచి మున్ముందు ఆశించిన రేట్లు రాకపోవచ్చు. బిజినెస్ మీద ప్రభావం పడొచ్చు. కాబట్టి ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయంలోనూ చిత్ర బృందాలు ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేయాల్సిన అవసరముంది.