‘ఓటేసిన ఫ్యాన్‌కే ఉరేసుకుంటున్నారు జ‌గ‌న్ రెడ్డీ!’

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పిన జగన్‌ను న‌మ్మి.. గ‌త ఎన్నిక‌ల్లో యువ‌త ఆయ‌న‌కు ఓట్లేశార‌ని.. ఇప్పుడు అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట సీఎం జగన్ ‘జాదూ క్యాలెండర్’ విడుదల చేశారని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలకు బదులు కేవలం 10వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి పండగ చేసుకోమంటున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ రాష్ట్ర ప్రభుత్వం యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

బాయ్‌బాయ్ ఏపీ.. అంటున్నారే!
జగన్‌ ట్యాక్స్ దెబ్బకి రెండేళ్ల పాలనలో ఒక్క ప్రైవేట్ కంపెనీ ఆంధ్రపదేశ్ వైపు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఉన్న పరిశ్రమలన్నీ బాయ్‌బాయ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటున్నాయని విమర్శించారు. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లూలూ, అదానీ.. ఇలా అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేసైనా రాష్ట్రంలో అన్ని ఖాళీల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేలా ఉద్యమిస్తామని లోకేశ్‌ వెల్లడించారు.

నేనున్నా..
“క‌ర్నూలు జిల్లా గోపాల‌న‌గ‌రం గ్రామానికి చెందిన నాగేంద్ర ప్రసాద్ బీఈడీ పూర్తిచేసి టీచ‌ర్ ఉద్యోగం సాధించాల‌నుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు స‌మ‌స్యలకు ప‌రిష్కారం కానేకాదు. నిరుద్యోగులు నిరుత్సాహ పడవద్దు. అందరం కలిసి పోరాడుదాం. పాదయాత్రలో సీఎం జగన్‌ వాగ్దానం చేసినట్లుగా 2.30 లక్షల ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 6,500 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. నెల రోజుల్లోగా కొత్త జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం” అని లోకేశ్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వైఖ‌రిపై ఆయ‌న నిప్పులు చెరిగారు. నిరుద్యోగుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో లోకేష్ ఆసాంతం.. జ‌గ‌న్ వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.