కోడి రామకృష్ణ సమర్పించు..

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. శతాధిక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించడం విశేషం. అంకుశం, భారత్ బంద్, అమ్మోరు సహా 80, 90 దశకాల్లో ఆయన రూపొందించిన చిత్రాలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే.

ఇక కోడి పనైపోయిందనుకున్న సమయంలోనూ ‘అరుంధతి’లో ఆయన తన సత్తా ఏంటో చాటి చెప్పారు. ఆ తర్వాత కూడా ఆపకుండా సినిమాలు తీస్తూనే వెళ్లారు. 2019లో అనారోగ్యంతో చనిపోవడానికి కొన్ని నెలల ముందు కూడా ఆయన ఓ ప్రాజెక్టు మీద పని చేస్తూ ఉన్నారు.

ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాతో ముడిపడ్డ ఆయన జీవితం.. ఇప్పుడు మరణానంతరం కూడా సినిమాతోనే కొనసాగేలా చూడాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కోడి రామకృష్ణ తనయురాలు కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయం అవుతుండటం విశేషం.

‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో కోడి రామకృష్ణ కుటుంబం కొత్త బేనర్ స్థాపించింది. ఈ బేనర్‌కు సమర్పుకుడు కోడి రామకృష్ణనే కావడం విశేషం. దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ బేనర్లో తొలి సినిమాను ‘రాజా వారు రాణి వారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరపుతో రూపొందించనున్నారు. కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించనుండటం విశేషం. హీరో కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారమే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

కోడి రామకృష్ణ తన కెరీర్లో ఎప్పుడూ దర్శకుడిగానే ఉన్నారు కానీ.. ఎప్పుడూ నిర్మాణం జోలికి వెళ్లలేదు. తన సన్నిహితులకు సినిమాలు చేసి పెట్టారు కానీ.. తానుగా ఏ చిత్రానికీ డబ్బులు పెట్టలేదు. ఐతే ఆయన మరణానంతరం బేనర్ పెట్టి కోడి పేరును సమర్పకుడిగా వేసి సినిమా తీస్తోంది ఆయన తనయురాలు. మరి ఈ ప్రయత్నంలో ఆమె ఏమేర విజయవంతం అవుతుందో చూడాలి.